కరోనా అలర్ట్ : సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి.. కీలక ఆదేశాలు.. అసలేంటిది..?
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా 'సోషల్ డిస్టెన్స్' పాటించాలని ప్రభుత్వాలు,వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు.. వ్యక్తుల మధ్య దూరం తప్పనిసరి అని చెబుతున్నారు.వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం ఒక మీటరు దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సోషల్ డిస్టెన్స్ అంటే ఏమిటి అన్న దానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు సూచనలు,సలహాలతో కూడిన నోట్ను విడుదల చేసింది.
ఏంటీ సోషల్ డిస్టెన్స్..
సోషల్ డిస్టెన్స్ అంటే నాన్-ఫార్మాసూటికల్. అంటే మందులతో సంబంధం లేనిది. వైరస్ నియంత్రణ కోసం తీసుకునే వ్యక్తిగత చర్యల్లో భాగంగా దీన్ని పాటించాల్సి ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు అది సోకకుండా ఉండేందుకు దీన్ని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికి ఎప్పుడు కరోనా సోకుతుందో తెలియని పరిస్థితులు నెలకొనడంతో.. వ్యక్తుల మధ్య దూరం పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో పాటు వైరస్ నియంత్రణ కోసం కొన్ని కీలక సూచనలు కూడా చేసింది.
మార్చి 31 వరకు వాటిని మూసివేయాల్సిందే..
విద్యా సంస్థలు(స్కూళ్లు,యూనివర్సిటీలు,వగైరా) జిమ్స్,మ్యూజియమ్స్,కల్చరల్&సోషల్ సెంటర్స్,స్విమ్మింగ్ పూల్స్,సినిమా థియేటర్స్ అన్నింటిని మార్చి 31 వరకు మూసివేయాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది. విద్యార్థులు ఇంటి వద్దే ఉండాలని.. ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రమోట్ చేస్తామని తెలిపింది. పరీక్షలను వాయిదా వేయడం గురించి ఆలోచిస్తున్నామని.. ఇప్పటికైతే షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అయితే పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల మధ్య సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని పేర్కొంది. విద్యార్థులు ఒకరితో ఒకరు ఒక మీటరు దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ఉపయోగించుకోవాలి..
అన్ని ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ మోమ్ ఇవ్వాల్సిందిగా సూచించింది. సమావేశాలన్నింటిని వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని సూచించింది. ఒకవేళ ఎక్కువమందితో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటే.. జనం సంఖ్యను తగ్గించడం లేదా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం చేయాలని తెలిపింది. రెస్టారెంట్స్లో శానిటైజర్స్,పరిశుభ్రత తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాదు,టేబుల్స్ మధ్య ఒక మీటరు కనీస దూరం ఉండాలని సూచించింది. ఇక ఇప్పటికే నిర్ణయించిన వివాహాలను తక్కువమంది మధ్య జరుపుకోవాలని.. సాంస్కృతిక కార్యక్రమాలు,ఇతరత్రా ఈవెంట్లను వాయిదా వేసుకోవాలని సూచించింది.
ఆ ప్రదేశాల్లో కమ్యూనికేషన్ డ్రైవ్..
స్థానిక అధికారులు క్రీడా సంస్థలతో మాట్లాడి వాటికి సంబంధించిన ఈవెంట్లలో ఎక్కువమంది పాల్గొనకుండా చూడటం లేదా వాయిదా వేసుకోమని సూచించాలని పేర్కొంది. అలాగే రాజకీయ నాయకులు,మత పెద్దలతో మాట్లాడి ఎక్కువమంది జనం పాల్గొనే సభలు,సమావేశాలు నిర్వహించకుండా చూడాలని కోరింది. అలాగే వర్తక వ్యాపారులు,స్టేక్ హోల్డర్స్కు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని చెప్పింది. కూరగాయల మార్కెట్లు,బస్ డిపోలు,రైల్వే స్టేషన్లు,పోస్ట్ ఆఫీసుల్లో కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించేలా కమ్యూనికేషన్ డ్రైవ్ చేపట్టాలని సూచించింది.
Recommended Video
సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి..
వాణిజ్య వ్యాపారాలేవైనా సరే.. కస్టమర్లతో ఒక మీటరు దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో.. ఎక్కువమంది కస్టమర్లు ఒకేసారి గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయవద్దని.. బస్సులు,విమానాలు,రైళ్లలో సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని పేర్కొంది. ఆసుపత్రులు కచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సిందేనని.. కరోనా పాజిటివ్ పేషెంట్లను కలిసేందుకు వారి కుటుంబ సభ్యులు,బంధువులు,స్నేహితులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని తెలిపింది. శుభ్రత ముఖ్యమని.. షేక్ హ్యాండ్స్,ఆలింగనం వంటివి కొన్నిరోజుల పాటు మానేయాలని సూచించింది. ఆన్లైన్ డెలివరీ మెన్స్/వుమెన్స్ ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని.. అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపింది.