అయోధ్యపై తీర్పు: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసిన కేంద్ర హోం శాఖ..!
న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై మరి కొద్దిరోజుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. కోట్లాదిమంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంశానికి సంబంధించిన తీర్పు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటోంది. రాష్ట్రాలను కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దేశంలోని 29 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను ఉద్దేశించి ఈ హెచ్చరికలను జారీ చేసింది.
అయోధ్యపై తీర్పు: కళాశాల భవనాలే కారాగారాలుగా: ఎనిమిది చోట్ల తాత్కాలిక జైళ్లు..!
తమ రాష్ట్రాల పరిధిలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకూడదని సూచించింది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సాధారణ అడ్వైజరీని పంపించింది. ముందు జాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను మోహరింపజేయాలని ఆదేశించింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను వెంటనే గుర్తించాలని, ఆయా చోట్ల కట్టుదిట్టమైన భద్రతను చేపట్టాలని సూచించింది. కేంద్రం నుంచి పారా మిలటరీ బలగాలు అవసరం అనుకుంటే.. వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖను సంప్రదించాలని కోరింది.
ఎలాంటి అవాంఛనీయ, అసాంఘిక సంఘటనలు చోటు చేసుకున్నా.. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఓ చిన్న పొరపాటు లేదా సంఘటన దేశవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉందని, ఇలాంటి సున్నిత పరిస్థితులను నివారించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. వదంతులను అరికట్టాలని, వాటిని వ్యాపింపజేసే ప్రసార మాధ్యమాలపైనా నిఘా ఉంచాలని కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టులో అయోధ్య భూవివాదానికి సంబంధించిన తీర్పు వెలువడటానికి ముందు రోజు నుంచే భద్రతా చర్యల్లోకి దిగాలని స్పష్టం చేసింది.
అత్యంత సున్నితమైన అయోధ్య భూ వివాదానికి సంబంధించిన కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలో తీర్పు వెలువడించబోతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతించాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచన ప్రాయంగా ఆదేశాలను జారీ చేసింది. తీర్పు వెలువడిన అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వ్యాఖ్యలు, వివాదాస్పద అంశాలపై ఇప్పటికే డేగకన్ను వేసింది. శాంతిభద్రతలను పరిరక్షించడానికి ఉత్తర్ ప్రదేశ్ కు పెద్ద ఎత్తున సాయుధ బలగాలను పంపించింది.