రియల్ ఎస్టేట్ డెవలపర్లకూ ఊపిరి: కాంట్రాక్టర్లపైనా: డిస్కమ్లకు రూ.90 వేల కోట్ల లిక్విడిటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కూడా ఊపిరి పోసే నిర్ణయాలను తీసుకుంది. ఈ ఏడాది మార్చి 25వ తేదీ తరువాత గడువు ముగిసిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల డెవలపర్ల దరఖాస్తులకు అనుమతి ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సూచించినట్లు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
చిరు ఉద్యోగులపై వరాలు: రూ.15 వేల లోపు జీతం ఉంటే: రూ.200 కోట్ల లోపు గ్లోబల్ టెండర్లు రద్దు
అన్ని రాష్ట్రాలకు సూచనలు..
ఆయా ప్రాజెక్టుల రిజిస్ట్రేన్, పూర్తి చేయాల్సిన గడువును ఆరు నెలల పాటు పొడిగించేలా చర్యలను తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకున్న ప్రాజెక్టుకు మాత్రమే ఈ సడలింపును వర్తింపజేస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆయా దరఖాస్తులను సుమోటోగా తీసుకోవాలని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా)కు కూడా కోరామని తెలిపారు. ఆరునెలల పాటు ఇది వర్తిస్తుందని అన్నారు.
ప్రభుత్వ కాంట్రాక్టర్లకు
ప్రభుత్వ ప్రాజెక్టులను దక్కించుకునే కాంట్రాక్టర్లకు కూడా ఈ విధానాలు వర్తిస్తాయని అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ద్వారా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లకు వాటిని పూర్తి చేయాల్సిన గడువును ఆరు నెలల పాటు పొడిగించినట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గూడ్స్, సర్వీస్ కాంట్రాక్టు పనులను దీని పరిధిలోకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. టెండర్లలో పేర్కొన్న విధంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల గడువును ఆరు నెలలకు పొడిగించామని అన్నారు.
Recommended Video
డిస్కమ్లకు రూ.90 వేల కోట్ల లిక్విడిటీ
దేశంలోని అన్ని విద్యుత్ పంపిణీ కంపెనీ (డిస్కమ్)లకు 90 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని లిక్విడిటీ రూపంలో కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫలితంగా విద్యుత్ వినియోగదారుడికి ఊరట లభిస్తుందని అన్నారు. లాక్డౌన్ వల్ల డిస్కమ్ల ఆదాయం క్షీణిచినట్లు అంచనా వేశామని అన్నారు. డిమాండ్ తగ్గడం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. దీనికోసం 94 వేల కోట్ల రూపాయల లిక్విడిటీని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీతోనే రుణాలు..
పవర్ ఫైనాన్స్ కంపెనీలు, రూరల్ ఎలక్ట్రిసిటీ కంపెనీలకు రుణాలను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. డిస్కమ్లతో పాటు విద్యుత్ ఉత్పాదక (జెన్కో) సంస్థలు కూడా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చని అన్నారు. డిస్కమ్లల్లో డిజిటల్ పేవ్మెంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రావాలని ఆదేశించామని చెప్పారు. డిస్కమ్లకు రిబేట్ ఇవ్వడం వల్ల అటు సాధారణ వినియోగదారుడు, పరిశ్రమలకు కూడా ఊరట లభించినట్టవుతుందని అన్నారు.