కరోనా వైరస్ : యుద్దప్రాతిపదికన వాళ్లను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొని తమ స్వస్థలాలకు వెళ్లిన దాదాపు 1000-2000 మంది ద్వారా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కేబినెట్ సెక్రటరీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు,డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలు కీలక అంశాలను చర్చించారు. ఆ వివరాలను కింద గమనించవచ్చు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిఘీ జమాత్లో పాల్గొని స్వస్థలాలకు వెళ్లినవారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దప్రాతిపదికన గుర్తించాలి. కోవిడ్ 19 నియంత్రణ చర్యలకు వీరివల్ల విఘాతం కలిగే అవకాశం ఉండటంతో ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి.
తబ్లిఘీ జమాత్లో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించాం. కాబట్టి జమాత్లో పాల్గొన్న విదేశీయులు ఏ రాష్ట్రాల్లో ఉన్నా.. అక్కడి ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకోవాలి. తబ్లిఘీ జమాత్ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వచ్చే వారం లోపు అన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని అమలుచేయాల్సి ఉంటుంది. దీని ద్వారా లబ్దిదారులకు ఆర్థిక సాయం అందుతుంది. సోషల్ డిస్టెన్స్ అమలుచేస్తూ దశలవారీగా దీన్ని చేపట్టాలి.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావవంతంగా అమలుచేయబడుతోందని గుర్తించాం. రాష్ట్రాల మధ్య సరుకుల రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి.
అవసరమైన అన్ని వస్తువుల తయారీని నిర్దేశించుకోవాలి. అలాగే ఆ వస్తువులకు సంబంధించిన సప్లై చైన్ని కూడా సరిగా నిర్వహించాలి.