రైళ్లలో రూ.30కే బ్రేక్ ఫాస్ట్.. రూ.50కే లంచ్, ఎక్కువ తీసుకుంటే ఫిర్యాదు చేయొచ్చు
రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహారపదార్థాల ధరల పట్టికను రైల్వేశాఖ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహారపదార్థాల ధరల పట్టికను రైల్వేశాఖ విడుదల చేసింది. ఆహారం, పానీయాలు వంటి వాటికి అధిక ధరలు వసూలు చేస్తున్నా.. సరఫరా చేస్తున్న పదార్థాలలో నాణ్యత ఉండడం లేదనేది ప్రయాణికుల ఫిర్యాదు.
ఈ నేపథ్యంలో రైళ్లలో కేటరింగ్ సేవల ధరల కార్డును రైల్వేశాఖ ప్రకటించింది. దీని ప్రకారం.. బ్రేక్ ఫాస్ట్.. అంటే అల్పాహారం రూ.30కే లభిస్తుంది. నాన్ వెజ్ అల్పాహారమైతే రూ.35. అలాగే వెజ్ లంచ్, డిన్నర్ ధర రూ.50 కాగా నాన్ వెజ్ లంచ్, డిన్నర్ ధర రూ.55. ఇక ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ లీటరు రూ.15గా.. కాఫీ, టీ ధర రూ.7గా నిర్ణయించారు.
Know the rate list of @IRCATERING in case of any discrepancies must reported to @RailMinIndia: We work for you 24x7 #Awareness pic.twitter.com/3aC59jakWI
— Ministry of Railways (@RailMinIndia) March 21, 2017
మంగళవారం ఆహార పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం సహాయక బృందాలు, రైల్వే అధికారులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరం ఆహార పదార్థాల ధరలను తెలియజేసే ఒక వీడియోను కూడా విడుదల చేశారు.
ఒకవేళ అమ్మకందారులు పైన పేర్కొన్న ధరల కంటే అధికంగా అడిగినా, పుచ్చుకున్నా తమకు ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు రైల్వేశాఖ సూచించింది.