సోదరితో సంబంధం పెట్టుకున్నాడని.. సుపారీ ఇచ్చి చంపించిన తమ్ముడు
ముంబై: తన సోదరితో ఓ యువకుడు సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో సుపారీ ఇచ్చి ఆ యువకుడిని చంపించిన ఓ మైనర్ తమ్ముడి బాగోతం ఇది. నవీ ముంబై నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది.
ఓ ఎరువుల కర్మాగారంలో పనిచేస్తోన్న ప్రవీణ్ ఫరాద్(24) ఓ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఆ అమ్మాయి తమ్ముడు(17)కి నచ్చలేదు. దీంతో ఎలాగైనా ప్రవీణ్ని చంపించేయాలని ఆ మైనర్ బాలుడు భావించాడు. ఓ సుపారీ గ్యాంగ్ను సంప్రదించి రూ.60 వేలకు ప్రవీణ్ను చంపేలా ఒప్పదందం కుదుర్చుకున్నాడు.
అడ్వాన్సుగా రూ.2 వేల రూపాయలను సదరు సుపారీ గ్యాంగ్కు చెందిన కిరాయి హంతుకులైన విలాస్, ఆకాష్లకు ఇచ్చాడు. వీరు ప్రవీణ్ను హాజీ మలాంగ్ గఢ్ కొండలపైకి పిలిచి, అతడిచేత బాగా మద్యం తాగించి, మత్తులో ఉన్న అతడ్ని హతమార్చి మృతదేహాన్ని ఓ డ్రైనేజిలో పడేశారు.
స్థానికులు డ్రైనేజిలో యువకుడి మృతదేహం చూసి భయంతో పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ప్రవీణ్ మృతదేహాన్ని స్వాధీని చేసుకుని పోస్టుమార్టం చేయించారు. సదరు కిరాయి హంతకులను అరెస్టు చేయగా ఈ సుపారీ విషయం వెలుగులోకి వచ్చింది.
సదరు యువతితో ప్రవీణ్కి ఉన్న సంబంధం నచ్చక, ఆ యువతి తమ్ముడే తమకు సుపారీ ఇచ్చి ఈ పని చేయించాడని వాళ్లు ఒప్పుకోవడంతో పోలీసులు ఆ యువతి తమ్ముడైన మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకుని బాల నేరస్తుల సదనానికి తరలించారు.