వివాదంలో శ్రీశ్రీ రవిశంకర్ ఆశ్రమం: వేద విద్యార్థి అనుమానాస్పద మృతి: యజ్ఙశాలలో నిర్జీవంగా.. !
పాట్నా: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పండిత్ శ్రీశ్రీ రవిశంకర్ స్థాపించిన ఆశ్రమ పాఠశాలలో వేద విద్యార్థి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన సంచలనం రేపుతోంది. ఆశ్రమం ఆవరణలోని యజ్ఙశాలలో మఫ్లర్తో ఉరి వేసుకున్న స్థితిలో ఆ విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు సిబ్బంది. ఈ ఘటనలో నలుగురిపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఆశ్రమ పాఠశాల సిబ్బందే తమ కుమారుడిని హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మఫ్లర్తో ఉరి వేసుకున్న స్థితిలో..
బిహార్లోని గయ జిల్లా బోధ్ గయలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి పేరు అమర్ కిశోర్ తివారీ. వయస్సు 13 సంవత్సరాలు. వజీర్గంజ్ సమీపంలో సేవ్ కర్జారా గ్రామానికి చెందిన మిథిలేష్ తివారీ కుమారుడు. రెండున్నరేళ్లుగా కిశోర్ తివారీ.. ఆశ్రమ పాఠశాలలో వేదాలను అధ్యయనం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఆ బాలుడు..యజ్ఙశాలలో నిర్జీవంగా కనిపించాడు. గొంతుకు మఫ్లర్ చుట్టుకుని ఉంది. మఫ్లర్తో ఉరి వేసుకున్న స్థితిలో కిశోర్ తివారీ మృతదేహాన్ని ఆశ్రమ సిబ్బంది గుర్తించారు.
మృతదేహంపై పెనుగులాట ఆనవాళ్లు..
కిశోర్ తివారీని వెంటనే మగధ్ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే బోధ్ గయా సబ్ డివిజన్ డీఎస్పీ సింధు శేఖర్ సింగ్, మగధ్ యూనివర్శిటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రవిశంకర్ ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. బాలుడి మృతదేహంపై పెనుగులాటకు సంబంధించిన ఆనవాళ్లు లభించినట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.
నలుగురిపై ఎఫ్ఐఆర్..
కిశోర్ తివారీ అనుమానాస్పద మృతి కేసులో మొత్తం నలుగురిపై మగధ్ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కిశోర్ తివారీ తండ్రి మిథిలేష్ తివారీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వేద విద్యా విభాగాధిపతి చందన్ కుమార్, సామవేద బోధకుడు ఆదర్శ్ మిశ్రా, ఆశ్రమ అకౌంటెంట్ రాజేంద్ర భాజన్, ఉద్యోగి స్వామి విష్ణు చైతన్య పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు మగధ్ యూనివర్శిటీ ఎస్ఐ ఉపేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పరారీలో నలుగురూ..
ఈ నలుగురూ తమ కుమారుడిని గొంతు నులిమి హత్య చేసి ఉంటారని మిథిలేష్ తివారీ ఆరోపిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ నలుగురూ పరారీలో ఉన్నారని అన్నారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవనే విషయాన్ని గుర్తించామని తెలిపారు. పరారీలో ఉన్న నలుగురిని గుర్తించడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉపేంద్ర కుమార్ చెప్పారు. మూడు రోజులుగా కిశోర్ తివారీ ఉదాసీనంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారని, దీనికి గల కారణాలపై విచారణ చేపట్టామని అన్నారు.