సీరియల్ కిల్లర్గా మారిన మైనర్ డ్యాన్సర్
న్యూఢిల్లీ: డ్యాన్సర్గా రాణించాలనుకున్న ఓ మైనర్ బాలుడు వరుస హత్యలకు పాల్పడడం ఆందోళనకు దారి తీస్తోంది. పాపులర్ డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొనాలనే కోరికను నెరవేర్చుకునేందుకు నిరుడు మరో బాలుడిని హత్య చేశాడు. తాజాగా మరో దారుణానికి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హత్య చేశాడు.
ఢిల్లీలోని బికె దత్తా కాలనీలో నివసించే మితలేష్ జైన్ (65) తన నివాసంలో శవమైన కనిపించాడన్ని బంధువులు గుర్తించారు. తొలుత సహజ మరణమనే అనుకున్నారు. కానీ ఆమెకు సంబంధించిన నగలు, నగదు, సెల్ ఫోన్స్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈలోగా అదృశ్యమైన ఆమె మొబైల్ ఫోన్ ఆన్ అయింది. దాని ఆధారంగా పోలీసులు కూపీ లాగి నిందితుడి వివరాలు తెలుసుకున్నారు.
గత సెప్టెంబర్లో 13 ఏళ్ల స్వప్నేష్ గుప్తాను హత్య చేసిన డ్యాన్సరే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఫరీదాబాద్లోని అతని నివాసంలో గురువారం నిందితుడిని అరెస్టు చేసారు. రియాల్టీ షోలో పాల్గొనేందుకు అవసరమైన డబ్బుల కోసమే ఆమెను హత్య చేసినట్లు బాలుడు అంగీకరించాడు
గతంలో ఈ డ్యాన్సర్ ఓ అమ్మాయితో కలిలి పథకం ప్రకారం స్వప్నేష్ గుప్తాను మభ్యబెట్టి ఉత్తరాఖండ్ తీసుకుని వెళ్లి గొంతు నులిమి చంపేసి కొండ మీది నుంచి తోసేశారు. ఆ తర్వాత 60 వేల రూపాయలు ఇవ్వాలంటూ స్వప్నేష్ తండ్రిని డిమాండ్ చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చంది.
ఈ కేసులో విచారణ అనంతరం ఆ డ్యాన్సర్ జువైనల్ హోంలో ఉన్నాడు. సత్ప్రవర్తన కారణంగా కరెక్షన్ హోం నుంచి ఇటీవలే విడుదలయ్యాడు. దాదాపు ఆరు నెలల వ్యవధిలో అతను రెండు హత్యలకు పాల్పడడం సంచలనం రేపింది.