మాంత్రికుడి మాట: కుమార్తెను సజీవంగా ఇంటిలో పాతిపెట్టిన తల్లిదండ్రులు, టీచర్ !
Recommended Video
లక్నో: అనారోగ్యంతో ఉన్న కుమార్తెను సజీవంగా ఇంటిలో పాతిపెడితే ఆరోగ్యంగా ఉన్న బిడ్డ జన్మిస్తాడు అని ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మిన తల్లిదండ్రులు దారుణంగా బిడ్డను చంపేశారు. ఇంటిలో గుంత తీసి బాలికను అక్కడే పాతిపెట్టేశారు. బాలిక గురించి టీచర్ ఆరా తియ్యడంతో అసలు విషయం వెలుగుచూసింది.
ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ జిల్లాలోని చౌధర్ పుర గ్రామంలో నివాసం ఉంటున్న మోని అనే మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు. మొదటి భర్త చనిపోవడంతో మోని అనంత్ పాల్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. మోని కుమార్తె తారా (5) అనారోగ్యంతో బాదపడుతోంది.
తారాకు ఎంత మంది వైద్యుల దగ్గర చికిత్స చేయించినా ఆరోగ్యం నయం కాలేదు. చివరికి ఓ మాంత్రికుడిని అనంత్ పాల్, మోని దంపతులు కలిశారు. తారాను సజీవంగా ఇంటిలో పాతిపెడితే మీకు ఆరోగ్యంగా ఉన్న బిడ్డ జన్మిస్తాడని మాంత్రికుడు సూచించాడు.
మాంత్రికుడి మాయమాటలు నమ్మిన అనంత్ పాల్, మోని దంపతులు తారాను సజీవంగా ఇంటిలో పాతిపెట్టారు. తారా స్కూల్ కు రాకపోవడంతో టీచర్ బాలిక సోదరుడిని ప్రశ్నించింది. తారా చనిపోయిందని, ఇక ఎప్పటికీ స్కూల్ కు రాదని బాలుడు చెప్పాడు.
టీచర్ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు అనంత్ పాల్, మోని దంపతులను తారా ఏమైయ్యింది అని నిలదీశారు. అనంత్ పాల్, మోని దంపతులపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనంత్ పాల్, మోని దంపతులను విచారణ చేశారు.
పోలీసుల విచారణలో అనంత్ పాల్, మోని దంపతులు అసలు విషయం అంగీకరించడంతో ఇంటిలో తారా మృతదేహాన్ని బయటకుతీసి పోస్టుమార్టుంకు తరలించారు. అనంత్ పాల్, మోని దంపతులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి మాంత్రికుడి కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ అంకిత్ మిట్టల్ మీడియాకు చెప్పారు.