‘ఒకేచోట పాతి పెట్టండి’: ప్రేమజంట ఆత్మహత్య
బెంగళూరు: ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే యువత నిస్పృహకు లోనై ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షల్లో ఫెయిలయ్యామని, ప్రేమ విఫలమైందని, తల్లిదండ్రులు, టీచర్ మందలించాడనే చిన్న కారణాలతో బలవన్మరణానికి పాల్పడి వారి కుటుంబంలో విషాదం నింపుతున్నారు.
తాజాగా, కర్ణాటకలోని గౌరిబిదనూరు తాలూకా నగరగెరె ఫిర్కా పెద్దనహళ్లిలో ఓ ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ జంటలో యువతి మైనరే కావడం గమనార్హం. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని కలత చెందిన గిరీశ్ (18), జ్ఞానవి అనే ప్రేమికులు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఏడాదిగా ప్రేమ.. పెళ్లి చేయండని..
గ్రామస్తులు, స్థానిక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సంవత్సర కాలంగా గిరీశ్, జాహ్నవిలు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు పెళ్లి చేయండీ అంటూ వారి వారి పెద్దలను అభ్యర్థించారు. కనీసం ఉన్నత చదువులు కూడా పూర్తికాకపోవడంతో రెండు వైపుల నుంచీ పెద్దలు అంగీకరించలేదు.
పెద్దలకు తెలియకుండా..
ఇంత చిన్న వయస్సులో పెళ్లేంటి? అంటూ మందలించారు. చేసేదిలేక ఆ ప్రేమికులిద్దరూ వారం కిందట తల్లిదండ్రులకు చెప్పకుండా దొడ్డబళ్లాపురలో ఉన్న గిరీశ్ బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఆ విషయం చివరికి పెద్దలకే తెలియడంతో సొంత ఊరికి రాక తప్పలేదు.
పంచాయతీ పెట్టారు..
కాగా, ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పెద్దలు పంచాయతీ పెట్టారు. వారి ప్రేమను ఎవరూ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారిద్దరూ.. సోమవారం రాత్రి రహస్యంగా మాట్లాడుకుని.. తల్లిదండ్రులకు ఓ ఉత్తరం రాశారు.
మేం ఆత్మహత్య చేసుకుంటున్నాం..
‘మేం ఆత్మహత్య చేసుకుంటున్నాం. మా ఇద్దరినీ ఒకేచోట పాతి పెట్టాలి. పోస్టుమార్టం చేయించవద్దు. క్షమించండి' అంటూ ఓ రాసిపెట్టి... ఊరి శివారులో ఉన్న పొలంలో చింత చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అటువైపు వెళ్లిన వారు గమనించడంతో ఈ విషయం వెలుగుచూసుంది. విగతజీవులుగా పడివున్న యువతీయువకులను చూసి.. ఇంత దారుణానికి పాల్పడతారని అనుకోలేదంటూ ఇరుకుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.