పెళ్లి ఫంక్షన్ నుండి ఎత్తుకెళ్లి, బాలికపై గ్యాంగ్ రేప్
బరేలీ: ఓ మైనర్ బాలికను పెళ్లి ఫంక్షన్ నుండి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన బరేలీ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన బిథ్రీ చైన్పుర్ గ్రామంలో జరిగింది. ఆమె పైన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
12 ఏళ్ల ఆ బాలిక ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు ఆ బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం మేరకు.. ఐదో తరగతి చదువుతున్న బాలిక సోమవారం రాత్రి పెళ్లి ఫంక్షన్కు వెళ్లింది. అక్కడి నుండి ఆమెను రామ్ బాబు(42), రాజేష్(18)లు కిడ్నాప్ చేశారు. వారు కూడా అదే బాలిక గ్రామానికి చెందిన వ్యక్తులు.
నిందితులు తనను ఎవరు లేని ప్రాంతానికి తీసుకు వెళ్లారని, అక్కడ ఆ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. తాను ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని చెప్పింది. నిందితులు తమ చేతుల్లో కంట్రీ మేడ్ పిస్టల్లు పట్టుకున్నారని చెప్పింది.
తన కూతురు ఇంటికి వచ్చి విషయం చెప్పగానే తాము నిందితుల ఇంటికి వెళ్లి అడగే ప్రయత్నం చేశామని, కానీ అప్పటికి కూడా నిందితులు ఇంటికి రాలేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. తర్వాత రోజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్నామని, బాలికను వైద్య పరీక్షలకు పంపించామని, కేసు విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.