మరో నిర్భయ ఘటన: చిన్నారిపై అత్యాచారం..ఉలిక్కిపడ్డ మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లో మరో నిర్భయ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి మృగంలా ప్రవర్తించాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్లోని మందసౌర్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల చిన్నారి స్కూలు తర్వాత తన తండ్రి కోసం వేచిచూస్తూ ఉన్నింది. అదే సమయంలో ఇర్ఫాన్ అనే 20 ఏళ్ల కీచకుడు చిన్నారిని అపహరించి బస్టాండు దగ్గర జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ప్రైవేట్ పార్ట్స్ను రాడ్ తో గాయపరిచాడు.అనంతరం ఆమె గొంతును కోసి అక్కడి నుంచి పారిపోయాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని గమనించిన వారు ఇండోర్లోని మై హాస్పిటల్కు తరలించారు. చిన్నారి ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తోందని వైద్యులు తెలిపారు. మొత్తం రెండు సర్జరీలు చేశామని వైద్యులు చెప్పారు. ఒక్కో సర్జరీకి మూడుగంటల సమయం పట్టిందన్నారు. జరిగిన ఘటనపై చిన్నారి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని చెప్పారు. చిన్నగా కోలుకుంటున్నప్పటికీ చిన్నారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ బ్రిజేష్ లహోటీ తెలిపారు. షాక్ నుంచి ఇంకా బాలిక తేరుకోలేదని మాట్లాడేందుకు చాలా భయపడుతోందన్నారు.
చిన్నారి తల్లిదండ్రులు, వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇర్ఫాన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇర్ఫాన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇర్ఫాన్ పాల్పడిన ఘాతుకం క్షమించరానిదని స్థానిక ముస్లింలు అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే స్థానికులు రోడ్లపైకొచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు తెలిపారు.
మరోవైపు ఇర్ఫాన్ చనిపోయాక అతన్ని పూడ్చేందుకు ఎవరూ స్థలం ఇవ్వరాదని ఫత్వా జారీ చేశారు అంజుమన్ ఇస్లాం పెద్దలు యూనస్ షేక్. అయితే స్కూలు ముగిశాక బాలికను ఇర్ఫాన్ తీసుకెళ్లడం సీసీకెమెరాల్లో రికార్డయ్యాయని దాని ఆధారంగా నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిన పట్టుకోగలిగామని మందసౌర్ ఎస్పీ మనోజ్ చెప్పారు.