ప్రియుడే: చేతులు కట్టేసి రేప్ చేశాడు
చెన్నై: తమిళనాడులో మరో దారుణ సంఘటన జరిగింది. సేలం జిల్లా ఆత్తూర్ రాజపాళయం గ్రామానికి చెందిన14 ఏళ్ల పదవ తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఈనెల 3వ తేదీ పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అళగువేల్ కిడ్నాప్ చేసి ఊరిబయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చేతులు కట్టేశాడు.
ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఏడాది పాటు ఆ ఇంజనీరింగ్ విద్యార్థి ఆమెను ప్రేమిస్తున్నాడు. రాత్రవు తున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె కోసం గాలించారు. మరుసటి రోజు ఉదయం ఊరిబయట కాళ్లు, చేతులు కట్టేసిన పరిస్తితుల్లో వున్న బాలికను గుర్తించారు.
గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కోలుకున్న తరువాత శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన విద్యార్థిని జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పుకోలేక మనోవేదనతో లేఖ రాసి ఆత్మ హత్యకు పాల్పడింది.
మధ్యాహ్నం భోజనానికి పిలిచేందుకు వెళ్లిన తల్లి నిర్జీవంగా పడివున్న కుమార్తెను చూసి విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె గదిలో దొరికిన లేఖ ఆధారంగా నిందితుడ్ని అరెస్టుచేసి జైలుకు తరలించారు.