ఘోరం: నమాజ్ చేయలేదని బాలికను చంపేశారు, భోరున విలపించిన తండ్రి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విధిగా నమాజ్ చేయడం లేదని కోపం ఓ బాలికను ఆమె కుటుంబీకులే చంపేశారు. ముంబైలోని అన్టాప్ హిల్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలికను హత్య చేసిన అత్త, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తల్లి చనిపోవడంతో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి చనిపోవడంతో గత కొంతకాలంగా దగ్గరి బంధువుల ఇంట్లో ఉంటోంది బాధిత బాలిక(15). పని ఒత్తిడి కారణంగా బాలికను చూసుకునే అవకాశం లేకపోవడంతో తండ్రే.. వీరింట్లో ఆమెను ఉంచాడు. కాగా, వరుసకు అత్తయ్యే మహిళ.. విధిగా నమాజ్ చేయాల్సిందిగా బాలికను తరచూ ఒత్తిడి చేసేది.
చున్నీ మెడకు బిగించి..
ప్రార్థన పట్ల అంతగా ఆసక్తిలేని ఆ బాలిక అత్తమాట వినేది కాదు. ఈ విషయంలోనే గత శుక్రవారం వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అత్త.. చున్నీని బాలిక మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది.
మృతిగా చిత్రీకరించే యత్నం
ఆ తర్వాత బాలిక హత్యను సాధారణ మృతిగా నమ్మించే ప్రయత్నం చేసింది. బాత్రూంలో జారిపడిందంటూ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే, బాలిక మెడపై కమిలిన గాయాలు ఉండటాన్ని గమనించిన వైద్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
భోరున విలపించిన తండ్రి
రంగంలోకి దిగిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించడంతో నిందితురాలు నేరాన్ని అంగీకరించింది. దీంతో బాలిక అత్తను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బాలిక మృతి విషయం తెలిసి ఆమె తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. నమాజ్ చేయకుంటే తనకు చెప్పాలి గానీ, చంపేస్తారా? అని వాపోయాడు. బాగా చూసుకుంటారని నమ్మి వాళ్ల ఇంట్లో పెడితే.. ఈ దుర్మార్గులు తన కూతురు ప్రాణం తీశారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.