యువతిపై 3నెలలపాటు గ్యాంగ్రేప్: మరో యువతి హత్య
అలీగఢ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 16ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు, అనంతరం ఆమెను హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్దుగంజ్ ప్రాంతానికి చెందిన బాధిత యువతి స్థానిక పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.
బుధవారం పాఠశాలకు వెళ్తున్న యువతిని కొందరు వ్యక్తులు అడ్డగించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
అయితే యువతి హత్యపై ఆగ్రహించిన గ్రామస్థులు.. విచారణకు వచ్చిన పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్థులను సముదాయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గోవాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
ఓ అనాథ బాలికను ముగ్గురు వ్యక్తులు ఏప్రిల్ నెల నుంచి పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన దక్షిణ గోవాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్యుపెమ్ అనే పట్టణంలో ఆ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు తనపై పలుమార్లు అత్యాచారం జరిగినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి, ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, నిందితులను ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది.
ఈ కేసులో కొన్ని వాస్తవాలను పరిశీలిస్తున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గవాస్ చెప్పారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావచ్చని, అయితే తాము ఇంకా అతడిని విచారించాల్సి ఉందని అన్నారు. విచారణ తర్వాత మాత్రమే నిందితుల పేర్లు, వయసు వెల్లడించగలమని తెలిపారు. ప్రస్తుతానికి ఆ బాలికను పనాజీలో ఉన్న ఓ మిషనరీ ట్రస్టుకు తరలించి, అక్కడే రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు.