పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా అమ్మాయిని వీరు ఏంచేశారంటే..?
గోరఖ్పూర్: ఉత్తర్ప్రదేశ్ నేరాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. అక్కడ ఆడపిల్ల బయటకు వెళ్లాలంటేనే జంకుతోంది. బయటకు వెళితే తిరిగి వస్తుందన్న గ్యారెంటీ అక్కడి తల్లిదండ్రులకు లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా తోడేళ్లలాంటి మృగాళ్లు అమ్మాయిలపై లైంగికదాడికి దిగుతున్నారు. ఈ మధ్యే ఉన్నావ్కు చెందిన ఓ బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై కోర్టులో వివరించేందుకు వెళుతుండగా ఆమెను తగులబెట్టారు నిందితులు. చికిత్స పొందుతూ అత్యాచార బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటన మరవక ముందే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న 17ఏళ్ల అమ్మాయిపై కొందరు అసభ్యకరంగా ప్రవర్తించి ఆమెను బట్టలను చించివేశారు.
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్లో దారుణం చోటుచేసుకుంది. గోరఖ్పూర్ జిల్లా చౌరీచౌరా ప్రాంతంలో ఓ 17 ఏళ్ల అమ్మాయిని కొందరు ఆకతాయిలు ఈవిటీజింగ్ చేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా అది తెలిసిన ఆకతాయిలు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. అమ్మాయి బట్టలు చించివేశారు. అంతేకాదు అడ్డుకోబోయిన తండ్రిపై కూడా పిడిగుద్దులు కురిపించారు. దాడి చేశాక అక్కడి నుంచి పారిపోయారు.
ఇక నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి అమ్మాయి ఫిర్యాదు చేసింది. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారు ఇద్దరూ అన్నదమ్ములని వారిపేర్లు గౌతం ముఖేష్ అని చెప్పింది. తను నడుచుకుంటూ వెళుతుండగా ప్రతిరోజు ఏదో ఒకరకంగా ఇబ్బందిపెట్టేవారని అమ్మాయి చెప్పింది. ఒకసారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని.. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదని బాధితురాలు చెప్పింది. మళ్లీ అలానే ఏడిపించసాగారని ఫిర్యాదులో పేర్కొంది. ఇక వీరి ఆగడాలను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వస్తుండగా ఇద్దరు నిందితులు అడ్డుకుని తన బట్టలు చింపివేశారని ఫిర్యాదు చేసింది. అడ్డువచ్చిన తన తండ్రిపై కూడా దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది.
ఇదిలా ఉంటే ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గౌతమ్ మహేష్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.