ఎత్తుకెళ్లి అమ్మాయిపై నాలుగు రోజులు నలుగురు గ్యాంగ్ రేప్
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. నలుగురు యువకులు 15 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లి, వరుసగా నాలుగు రోజులపై ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ధీందాల్వీ గ్రామంలో జరిగింది.
నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిని యువకులు సోమవారంనాడు ఎత్తుకెళ్లారు. బహర్భూమికి వెళ్లినప్పుడు ఆమెను తుపాకితో బెదిరించి ఆమెను అపహరించారు. ఆమెను ఓ ఇంటికి తీసుకుని వెళ్లి నాలుగు రోజుల పాటు నిర్బంధించి వరుసగా అత్యాచారం చేశారు.
స్పృహ తప్పిన అమ్మాయిని పోలీసులు గురువారంనాడు రక్షించారు. అమ్మాయి తండ్రి తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఆమెను కనిపెట్టారు. జనవరి 26వ తేదీన నలుగురు వ్యక్తులు తనను ఎత్తుకెళ్లి నాలుగు రోజులు అత్యాచారం చేశారని బాధితురాలు తన వాంగ్మూలంలో చెప్పింది.
ముకేష్, ప్రదీప్, కుల్లు, దుశ్యంత్ తనను కిడ్నాప్ చేసి, సమీపంలోని ఇంట్లో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. ముకేష్, ప్రదీప్లను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా ఇద్దరిని పట్టుకోవాల్సి ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.