పాపం పసిపాప: తల్లి మృతి చెందింది..మేనమామ కనికరించలేదు..ఈ చిన్నారి ఏంచేసింది..?
ఇండోర్ : చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి అనారోగ్యం పాలైంది. తినేందుకు తిండి లేదు... ఓ వైపు అనారోగ్యంతో ఉన్న తల్లి మరో వైపు కాయకష్టం చేయలేని వయసు. తల్లికి జబ్బు చేయడంతో సొంతవాళ్లే వారిని వెలేశారు. ఈ కష్టాలకు తోడు తల్లి మరణం. ఇవన్నీ ఒకేసారి ఆ చిన్నారిని చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిన్నారిని ఎవరు ఆదుకున్నారు..? అసలు ఏమి జరిగింది తెలియాలంటే మధ్యప్రదేశ్కు వెళ్లాల్సిందే
తల్లికి ప్రాణాంతక వ్యాధి సోకింది
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో ఓ చిన్నారి తల్లికి పుట్టెడు కష్టం వచ్చి పడింది. తన చిన్నతనంలోనే అంటే 2011లో తండ్రిని పోగొట్టుకుంది. ఇక అప్పటి నుంచి తల్లి తన ఆలనా పాలనా చూస్తూ వచ్చింది . అంతా బాగుందనుకుంటున్న సమయంలో చిన్నారి తల్లి క్రమంగా అనారోగ్యం పాలవుతూ వచ్చింది. ఆస్పత్రికి వెళ్లి చూపించుకోగా... ఆమెకు ఎయిడ్స్ ఉన్నట్లు వైద్యపరీక్షలో తేలింది. ఇక అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతూ వచ్చింది. తల్లికి హెచ్ఐవీ పాజిటివ్గా తేలడంతో ఆమె పెద్ద కొడుకు ఇంటిని వదిలి తన మేనమామ ఇంటికి వెళ్లాడు. కానీ ఈ చిన్నారి బాలిక మాత్రం తల్లితోనే ఉంది.
తల్లి మరణిస్తే కనీసం జాలి చూపని దుర్మార్గపు బంధువులు
ఇద్దరూ ఒక పూట తింటే మరో పూట పస్తుండేవారు. అలాంటి పరిస్థితుల్లో జీవించారు. అయితే ఒక నెలనర్ర క్రితం తల్లికి జబ్బు తీవ్రత పెరిగిపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఇక అప్పటి నుంచి చికిత్స పొందుతూ గతవారమే మృతి చెందింది.అయితే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. ఈ చిన్నారికి ఏమి చేయాలో పాలుపోలేదు. ఓ వైపు తల్లి మృతి చెందిందన్న బాధతో చిన్నారి ఉంది. మరోవైపు ఆమె దహన సంస్కారాలు చేసేందుకు కావాల్సిన డబ్బులు లేకపోవడంతో ఏమిచేయాలో తెలియలేదు ఆ చిన్నారికి. దీంతో ఆస్పత్రి వారు తల్లి మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. తల్లి మృతి గురించి తన అన్నకు మేనమామకు బాలిక చెప్పగా వారు మాత్రం మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు నిరాకరించారు. బాలిక మైనర్ కావడంతో తల్లి మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు నిరాకరించారు.ఇక మార్చురీలో తన తల్లి మృతదేహం ఉండటంతో ఆ ఆస్పత్రి చుట్టే కన్నీళ్లు పెడుతూ తచ్చాడసాగింది.
ఇంట్రెస్టింగ్: నీరవ్ మోడీ అరెస్టు కాగానే చెప్పిన కథ ఇదే... బెయిల్ తిరస్కరించిన కోర్టు
తల్లి మృతిని చూసి తల్లడిల్లిన పసిహృదయం
ఇక ఎవరూ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు రాకపోవడంతో ఆ తల్లి భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పసిహృదయం తల్లడిల్లింది. ఎవరిని సంప్రదించాలో తెలియక గట్టిగా ఏడ్వసాగింది. కొందరు సామాజిక కార్యకర్తలు బాలిక ఆవేదన గురించి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి తల్లి దహన సంస్కారాలు పూర్తి అయ్యేందుకు సహాయం చేశారు. తల్లీ తండ్రి ఇద్దరూ లేకపోవడం అన్న వదిలి వెళ్లిపోవడంతో చిన్నారి ఎలా జీవిస్తుందనే ప్రశ్న ఉత్పన్నమైంది. వెంటనే మరో మహిళ ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. అయితే పిల్లల సంక్షేమ కమిటీ వారు ఆ చిన్నారిని దత్తత తీసుకోదలచిన మహిళతో వెళతావా అని అడుగగా... అందుకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. విషయం తెలుసుకున్న తన అన్న మేనమామ అక్కడికి చేరుకుని చిన్నారిని తమవెంట తీసుకెళతామని అధికారులకు చెప్పడంతో బాలికను వారికే అప్పగించారు.