‘రేపిస్టు నేత బయటికొచ్చాడు, భయంగా ఉంది’: సీఎంకు బాధితురాలి మెసేజ్
పాట్నా: తనపై అత్యాచారానికి పాల్పడిన ఓ పవర్ఫుల్ రాజకీయ నాయకుడు బెయిల్పై బయటకొచ్చాడని, ఇప్పుడు తనకు చాలా భయంగా ఉందని, తన కుటుంబాన్ని నాశనం చేస్తాడేమోనని ఆందోళన చెందుతున్నట్లు పదిహేనేళ్ల బాధితురాలు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు వాట్సప్ ద్వారా విజ్ఞప్తి చేసింది.
వివరాల్లోకి వెళితే... గత ఫిబ్రవరి 6న ఆర్జేడీలోని కీలక నేతల్లో ఒకరైన రాజ్ బల్లభ్ యాదవ్ ఓ మహిళ సాయంతో పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. '30 వేల రూపాయలు ఇస్తాను, కేసు విత్ డ్రా చేసుకో' అంటూ బాలికను వేడుకున్నాడు.
అయితే, బాలిక కుటుంబం అంగీకరించకపోవడంతో నెల రోజులు పరారీలో ఉండి ఆ తర్వాత లొంగిపోయాడు. దీంతో న్యాయస్థానం అతనిని రిమాండుకి పంపింది.

తాజాగా రాజ్ బల్లభ్కు బెయిల్ మంజూరు కావడంతో సదరు బాలిక భయాందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో వాట్సప్ ద్వారా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మీడియా ప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఆమె మెసేజ్ పంపింది.
తన సందేశంలో.. 'నాపై అత్యాచారానికి పాల్పడిన యాదవ్ జైలు నుంచి బయటకొచ్చాడు. నేను నా కుటుంబం గురించి చాలా భయపడుతున్నాను. నాపై ఆ దుర్మార్గుడు చేసిన అఘాయిత్యంతో నేను సర్వం కోల్పోయాను. ఇప్పుడు నేను కొత్తగా కోల్పోయేందుకు ఏమీ లేదు. అయితే, నా కుటుంబాన్ని కోల్పోతానేమోనని భయమేస్తోంది. అతను నన్ను, నా కుటుంబాన్ని ఏ క్షణంలో నైనా చంపగలడు. అతనికి పోలీసులు కూడా భయపడుతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మైనర్ బాధితురాలు.
ఈ నేపథ్యంలో రాజ్ బల్లభ్కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దానిపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాగా, ప్రస్తుతం స్థానికంగా సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది.