దారుణం: మైనర్పై గ్యాంగ్రేప్, తల్లిదండ్రుల ముందే సజీవ దహనం
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. 14 ఏళ్ళ బాలికపై గురువారం రాత్రి దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు కుటుంబసభ్యుల ఎదుటే ఆ బాలికను సజీవదహనం చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్ర జిల్లాలో చోటు చేసుకొంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకొంది.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజతెందుహ గ్రామంలో 14 ఏళ్ళ మైనర్ బాలికపై మద్యం తాగి వచ్చిన నలుగురు యువకులు బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు గ్రామపంచాయితీ పెద్దలకు చెప్పారు. నిందితులకు రూ.50 వేల జరిమానా విధించి గుంజీలు తీయించారు.పంచాయితీ పెట్టించి తమ పరువు తీయించారనే నెపంతో బాధితురాలి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను కొట్టారు. బాలికకు నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటనలో బాధితురాలు పూర్తిగా కాలిపోయి మరణించింది. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.