గిరిజన విద్యార్థినులపై రాజకీయ నేతల లైంగిక దాడి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోబ్రా జిల్లాలోని పాలీ ప్రభుత్వ గిరిజన విద్యార్థినుల వసతి గృహంలో దారుణం జరిగింది. వసతి గృహంలోకి ప్రవేశించిన స్థానిక రాజకీయ నేతలు అమాయక గిరిజన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాలికల వసతి గృహం సూపరింటెండెంట్ లేని సమయంలో స్థానిక రాజకీయ నేతలు వసతి గృహంలోకి వెళ్లారు. వసతి గృహాన్ని పరిశీలించాలనే సాకుతో వారు లోపలికి వెళ్లారు.
వసతి గృహం లోపలికి వెళ్లిన రాజకీయ నేతలు విద్యార్థినులపై అత్యాచారయత్నం చేశారు. ఓ విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం.. జనపథ్ అధ్యక్షుడు గన్రాజ్ సింగ్ కాన్వార్ బాలికల గదిలోకి ప్రవేశించాడు.
‘నన్ను కౌగిలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. నేను అతన్ని తోసేశాను. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు అని రూ. 100 ఇచ్చేందుకు యత్నించాడు' అని బాధిత బాలిక చెప్పింది.
తనతోనే కాకుండా పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని వాపోయింది. హాస్టల్లోకి ప్రవేశించిన వారిలో జిల్లా పంచాయతీ ఉపాధ్యాక్షుడు అజయ్ జైస్వాల్, పాలీ కాంగ్రెస్ నేత శంకర్ దాస్ మహంత్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. నిందితులపై ఐపిసి సెక్షన్ 448, 354, 186, 147 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.