తాతయ్యపై పగ.. మనువరాలిపై రేప్.. : మైనర్ ఘాతుకం
కాన్పూర్ : దేశంలో బాలనేరస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆలోచనలు చదువు చుట్టూ తిరగాల్సిన వయసులో నేరాలపై ఫోకస్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా 14,15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కాన్పూర్ పరిధిలోని ఫిరోజాబాద్ లో చోటు చేసుకుంది.
కాగా, బాలురు చేసిన ఈ దుశ్చర్య వెనుక కారణాలు విస్మయం కలిగించేవిగా ఉన్నాయి. తరాల నాటి పగను ఒంటబట్టించుకున్న నిందితులు తాము పుట్టకముందు జరిగిన ఓ ఘటనకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. ఫిరోజాబాద్ లో ఉండే ఓ రెండు కుటుంబాల మధ్య ఏళ్లుగా శత్రుత్వం ఉంది. 14 ఏళ్ల క్రితం రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవల్లో.. బాలిక తరుపు తాతయ్య అవతలి కుటుంబానికి చెందిన ఓ నిందితుడిని తుపాకీతో కాల్చి చంపేశాడు.
పద్నాలుగేళ్ల క్రితం చోటు చేసుకున్న ఆ ఘటన గురించి ఆ బాలుడికి ఎవరో చెప్పారో గానీ మొత్తానికి తుపాకీతో కాల్చిన సదరు తాతయ్యపై కక్ష పెంచుకున్నాడు. వయసు రీత్యా ఘటన జరిగిన నాటికి అతను జన్మించలేదు, అయినా సరే పాత వైరాన్ని తిరగదోడుతూ.. సదరు తాతయ్యపై ప్రతీకారంగా ఆయన మనువరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఏదో పనిమీద పనికి వెళ్లి వస్తున్న పదేళ్ల బాలికపై అప్పటికే కన్నేసి ఉంచిన బాల నిందితుడు అతని స్నేహితుడితో కలిసి ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం విషయం పోలీసులకు తెలియగా స్పృహ కోల్పోయిన బాలికను ఆగ్రా ఆస్పత్రికి తరలించి, నిందితులిద్దరినీ జువైనల్ కు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.