500కోట్ల కాల్ సెంటర్ స్కాం: ప్రియురాలికి రూ.2.5కోట్ల కారు కానుక
థానే: అమెరికన్లకు రూ. వందల కోట్లలో టోకరా పెట్టిన మహారాష్ట్రలోని థానే నకిలీ కాల్సెంటర్లకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. థానేలో ఏర్పాటు చేసిన ఈ నకిలీ కాల్సెంటర్ల ద్వారా.. పన్ను ఎగ్గొట్టినట్లుగా తమ మాటలతో అమెరికన్లను భయపెట్టి, మభ్యపెట్టి వందల కోట్లు కొల్లగొట్టినసంగతి తెలిసిందే.
అతి తక్కువ వ్యవధిలో రూ.500 కోట్ల వరకు కొల్లగొట్టిన ఈ ఉదంతంలో కీలక పాత్ర పోషించిన మాస్టర్ మైండ్ 23 ఏళ్ల సాగర్ థక్కర్ అలియాస్ షాగ్గీ.. తన ప్రేయసి కోసం రూ.2.5 కోట్లు ఖరీదైన ఆడీ ఆర్8 వాహనాన్ని పుట్టినరోజు కానుకగా ఇచ్చినట్లు థానే పోలీసులు వెల్లడించారు.
అప్పటికే ఖరీదైన కార్లు కొనుగోలు చేసిన షాగ్గీ.. అహ్మదాబాద్ మొత్తంలో కోట్లు విలువ చేసే ఆడీ కారు కొన్న మొదటి వ్యక్తి అనివెల్లడించారు. ప్రస్తుతం కారు స్వాధీనం చేసుకుందామంటే అతని ప్రేయసి పరారీలో ఉందని ఆమె కోసం గాలింపు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
షాగ్గీ తమతో ఈ విషయాన్ని తరచూ చెప్తుండేవాడని నిందితులు విచారణలో చెప్పడంతో ఈ సంగతి బయటపడింది. షాగ్గీ అహ్మదాబాద్కి మకాం మార్చాక తన సోదరి రీమాతో కలిసి ఉండేవాడు. అమెరికాకి చెందిన ఓ వ్యక్తి నుంచి అమెరికన్ల గురించి కీలక సమాచారం అందిస్తుండడంతో ఈ కుంభకోణం మొదలైంది. ఈ సమాచారంతోనే భారీ కాల్ సెంటర్ స్కాం చేశారు ఈ కీలాడీలు.
అమెరికన్లకే రూ. 500కోట్ల టోకరా: నకిలీ కాల్సెంటర్ రాకెట్ గుట్టురట్టు
కాగా, వచ్చిన డబ్బుతో షాగ్గీ దుబాయ్లో భారీ వ్యాపారం ఒకటి ప్రారంభించినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం థానే కాల్సెంటర్ నిందితులను ఏడుగురు ఎఫ్బీఐ అధికారులు కలిసి విచారణ జరపబోతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కాల్ సెంటర్ స్కాంపై విస్తృతంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.