సర్జికల్ స్ట్రైక్స్ నిజమే, ఉగ్రవాదులకు పాక్ సైన్యం అండ: పీఓకే ఎస్పీ సంచలనం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: యూరీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడులపై పాకిస్థాన్ తోపాటు మన దేశంలోని కొందరు రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్.. అసలు సర్జికల్ దాడులే జరగలేదంటూ బుకాయిస్తుంటే.. మనదేశంలోని పలువురు రాజకీయ నేతలు సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలు చూపాలంటూ కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మన సైన్యం మాట కూడా నమ్మే స్థితిలో లేరా? అంటూ వారిపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది బిజెపి.
కాగా, తాజాగా సర్జికల్ దాడులు జరిగిన మాట వాస్తవమేనంటూ దాడికి సంబంధించిన పలు సంచలన విషయాలు వెల్లడించారు పీఓకేలోని మీర్పూర్ ఉన్నతాధికారి ఒకరు. ఓ మీడియా సంస్థ జరిపిన స్పెషల్ స్టింగ్ ఆపరేషన్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ అయిన గులాం అక్బర్.. సర్జికల్ దాడులపై సవివరింగా తెలిపారు.
సదరు మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు ఎస్పీ గులాంకు ఫోన్ చేసి.. 'సర్జికల్ స్ట్రైక్స్ నిజమేనా? ఎలా? జరిగాయి? ఏ సమయంలో జరిగాయి? మన ఆర్మీ ఎలా స్పందించింది?' అంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు. దీంతో జరిగిన ఘటన మొత్తం ఆయన వివరంగా పూసగుచ్చినట్లు వివరించారు గులాం.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే...'సర్.. అది రాత్రి సమయం. ఒక్కసారిగా కాల్పులు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జరుగుతూనే ఉన్నాయి. సుమారు 3 నుంచి 4 గంటల పాటు కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఒక్కసారిగా దాడులు ప్రారంభం కావడంతో పాకిస్థానీ సైనికులకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. వారు తేరుకునే లోపే ఐదుగురు సైనికులు తూటాలకు బలయ్యారు. ఉగ్రవాదులు కూడా పెద్దఎత్తునే చనిపోయారు. వెంటనే అందరి మృతదేహాలను ట్రక్కులో వేసుకుని పాక్ సైన్యం వెళ్లిపోయింది. అయితే ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం లెక్క సరిగ్గా తెలీదు' అని ఎస్పీ తెలిపారు.
అంతేగాక, భారత సైన్యం దాడులు జరిపిన ప్రాంతాల పేర్లు కూడా ఆయన చెప్పడం గమనార్హం. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత తేరుకున్న పాకిస్థానీ సైన్యం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టిందని అన్నారు. అందులో భాగంగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్లో ప్రవేశించడానికి పాకిస్థాన్ సైన్యం సాయం చేస్తోందని కూడా ఆయన వివరించారు.
ఉగ్రవాదులను ఆర్మీయే తీసుకొస్తుందని, వారిని ఆర్మీయే కాపాడుతోందని, కనీసం తమకు కూడా వారి వివరాలు తెలియవని ఆయన పేర్కొన్నారు. జీహాదీల వివరాలు కేవలం ఆర్మీకి తప్ప ఇంకెవరికీ తెలియదని ఆయన చెప్పడం గమనార్హం. ఈ అధికారి మాటలు వింటుంటే పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు కలిసే పని చేస్తున్నట్లు అర్థమవుతోంది. అంతేగాక, భారత్లో దాడులు చేసేందుకు పాక్ సైన్యం ఉగ్రవాదులకు ఎంతగా సహకరిస్తుందో ఆయన మాటలు బట్టి తెలుస్తోంది.