రెచ్చగొడితే ఎలాంటి దాడులు చేస్తామో ఊహించలేరు: పాక్కు ఆర్మీ చీఫ్ హెచ్చరిక
కవ్వింపు చర్యలకు కానీ, రెచ్చగొట్టే చర్యలకు కానీ పాకిస్తాన్ దిగితే వెంటనే ప్రతీకార చర్యలు భారత్ వైపు నుంచి ఉంటాయని ఇందులో ఎలాంటి సందేహం లేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ దాయాది దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆదాడులు కూడా చాలా భయంకరంగా ఉంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్లు అయిన సందర్భంలో బిపిన్ రావత్ న్యూఢిల్లీలో జరిగిన ఓ సెమినార్లో పాల్గొని ప్రసంగించారు. పాకిస్తాన్కు ఏదో రకంగా భారత్లోకి చొరబడి దాడులు చేయాలని భావిస్తోందని అలాంటి దాడులను ధీటుగా తిప్పికొడతామని బిపిన్ రావత్ అన్నారు.భారత భూభాగాన్ని ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసని చెప్పిన రావత్... పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తే ఆ తర్వాత ఉత్పన్నమయ్యే పరిణామాలు కఠినంగా ఉంటాయని చెప్పారు.
మానవుడి విలువ ఏమిటో తెలియకుండా పాక్ ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎవరూ ఊహించనంతగా తీవ్ర పరిణామాలు ఉంటాయని బిపిన్ అన్నారు. ఎప్పటికీ భారత్కు నిజమైన ఆస్తులు సైనికులే అని కొనియాడారు.2014 నుంచి ఇప్పటి వరకు 800 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిందని చెప్పారు.2018లో 249 మందిని హతమార్చినట్లు చెప్పారు. ఇక చైనా నుంచి కూడా ఎలాంటి చొరబాట్లు భారత్లోకి లేవని రావత్ స్పష్టం చేశారు. జూలై 6న దలైలామా పుట్టినరోజు సందర్భంగా సరిహద్దు రేఖ వద్ద టిబెట్ జాతీయ జెండాలను టిబెటన్లు ఎగురవేశారు. ఆ సమయంలో చైనా సైనికులు సరిహద్దు రేఖ దాటి భారత్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో బిపిన్ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.