వక్రభాష్యం... మోదీ వ్యాఖ్యలపై వివాదం...పీఎంవో ఆఫీస్ రియాక్షన్...
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పే ప్రయత్నం జరుగుతోందని పీఎంవో కార్యాలయం అభిప్రాయపడింది. దీనిపై అనవసర రాద్దాంతాన్ని,వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించింది.' చైనా వాస్తవాధీన రేఖను అతిక్రమించేందుకు ప్రయత్నించడంతోనే జూన్ 15న గాల్వన్ వ్యాలీలో హింస చోటు చేసుకుందని కేంద్రం స్పష్టంగా చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించిందని.. వాటిని తొలగించేందుకు నిరాకరించడంతోనే ఘర్షణ చోటు చేసుకుంది.' అని పీఎంవో కార్యాలయం వివరణ ఇచ్చింది.
చైనా సరిహద్దుల్లో సైనికుల మృతిపై కేంద్రానికి రాహుల్ సూటి ప్రశ్నలు- ఇరుకున పడ్డ మోడీ..
రాహుల్ వ్యాఖ్యలతో కలకలం...
వాస్తవాధీన రేఖను అతిక్రమించి చైనా ఎలాంటి చర్యలకు దిగినా భారత్ ధీటుగా తిప్పికొడుతుందని ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశంలో పేర్కొన్నారని పీఎంవో గుర్తుచేసింది. భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని... ఏ మిలటరీ పోస్టును ఆక్రమించలేదని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆక్రమణ ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టిందని తెలిపింది.
చైనా దూకుడుకు లొంగిపోయి మోదీ భారత భూభాగాన్ని వదిలిపెట్టాడంటూ కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం ఈ వివరణ ఇచ్చింది. అసలు గాల్వన్ వ్యాలీలో ఏం జరిగిందో ప్రధాని మోదీ ఇప్పటికీ వివరంగా చెప్పలేకపోతున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ మోదీని ప్రశ్నిస్తూనే ఉంది. ఒకవేళ చైనా మన భూభాగాన్ని ఆక్రమించకపోతే 20 మంది సైనికులు ఎలా చనిపోయారని.. అసలు వారు ఎక్కడ చంపబడ్డారని రాహుల్ శనివారం(జూన్ 21) ఉదయం కేంద్రాన్ని మరోసారి ప్రశ్నించారు.
చైనా సైన్యం భారత్లో చొరబడలేదన్న మోదీ
చైనా భారత భూభాగాన్ని ఆక్రమించలేదని.. చైనా బలగాలు మన భూభాగంలోకి చొరబడలేదని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ అన్ని పార్టీల నేతలకు స్పష్టం చేశారు. అంతేకాదు ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే భారత్ ధీటుగా స్పందిస్తుందని.. మన సైనికులు డ్రాగన్కు తగిన బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. సరిహద్దు రక్షణ విషయంలో భారత సైన్యం ఎక్కడా రాజీపడదని స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఏకపక్ష చర్యలను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ వైపు నుంచి ఆగని విమర్శలు..
అదే సమయంలో ప్రతిపక్ష నేతల విమర్శలపై కూడా మోదీ అఖిలపక్ష సమావేశంలో స్పందించారు. ఓవైపు సరిహద్దులో మన సైనికులు దేశం కోసం పోరాడుతుంటే... మరోవైపు కొంతమంది దీన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరమని చెప్పారు. ఇది సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఏదేమైనా చైనాను ఎదుర్కొనే విషయంలో అన్ని పార్టీలు కేంద్రానికి అండగా ఉంటాయని అఖిలపక్ష సమావేశంలో తెలిపాయి. అయితే కాంగ్రెస్ మాత్రం గాల్వన్ వ్యాలీలో ఘర్షణలపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ విషయంలో రాజకీయం తగదని బీజేపీ అంటుంటే... అక్కడ అసలేం జరిగిందో బయటపెట్టాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.