అన్నీ ఆయనతోనే: మిస్త్రీ తీవ్ర ఆగ్రహం, భర్తీ చేసేది ఈయనేనా?
ముంబై: టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించబడిన సైరస్ మిస్త్రీ, టాటాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, సైరస్ మిస్త్రీ మరోసారి పెదవి విప్పారు. తన పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. డొకొమో ఒప్పందాల పైన తాను సొంతగా నిర్ణయాలు తీసుకున్నాననే వాదనలను మిస్త్రీ కొట్టి పారేశారు.
రతన్ టాటాకు తెలియకుండా తాను టాటా - డొకొమో ఒప్పందం జరిపినట్లు చెప్పడం సరికాదన్నారు. అది తన సొంత నిర్ణయం కాదని తెలిపారు. తొలి నుంచి చివరి దాకా ప్రతి అడుగు రతన్ టాటా ఆమోదంతోనే నడిచిందన్నారు.
ఒప్పంద చర్చలు టాటా బోర్డు ఆధ్వర్యంలోనే జరిగాయన్నారు. ఇవన్నీ టాటా సన్స్ బోర్డు ఆమోదంతోనే తీసుకున్న నిర్ణయాలు అని చెప్పారు. అలాగే మొత్తం సమాచారాన్ని రత్ టాటా, సూనావాలా, ట్రస్టీలకు ఎప్పటికప్పుడు అందించినట్లు చెప్పారు.
ఈ క్రమంలో లీగల్ కౌన్సెల్ సమావేశాలలో మిస్త్రీతో పాటు ప్రత్యేక సమావేశాల్లో కూడా వీరు పాల్గొన్నారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టాటా విలువలు, రతన్ టాటా, సూన్ వాలా అభిమతానికి విరుద్ధంగా మిస్త్రీ తన సొంత నిర్ణయం తీసుకున్నారని చెప్పడం సరికాదన్నారు.
2009లో జపాన్ సంస్థతో డొకొమో ఒప్పంద సంతకాలు మిస్త్రీ నియామకానికి ముందే జరిగాయన్నారు. టాటా టెలి సర్వీసెస్లో అప్పుడే డొకొమో 26.5 శాతం వాటాను కలిగి ఉందన్నారు.
మిస్త్రీ స్థానం ఆయనదేనా?
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎన్ఎస్డీఏ), నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్డీసీ) ఛైర్మన్ సుబ్రమణియన్ రామాదొరై తన పదవులకు రాజీనామా చేశారు. రామాదొరైది కేబినెట్ మినిస్టర్ హోదా. 71ఏళ్ల రామాదొరై ఆరోగ్య కారణాల వల్ల తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపిన లేఖలో పేర్కొన్నారు.
రామాదొరై రాజీనామాను ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు ఆమోదించాయి. ఈ నేపథ్యంలో వ్యాపార వర్గాల్లో ఓ వాదన వినిపిస్తోంది. టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించారు. ఆ స్థానంలో టాటా గ్రూప్తో సుదీర్ఘ అనుబంధం ఉన్న రామాదొరైని నియమిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.