ఆకతాయిలారా బహుపరాక్! వందే భారత్ రక్షణకు స్పెషల్ టీమ్స్
ఢిల్లీ : భారత్ లో తయారైన మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆది నుంచి రాళ్ల దెబ్బలు తింటోంది. ఢిల్లీ - వారణాసి మధ్య నడిచే ఈ ఇంజన్లెస్ ట్రైన్ ఫిబ్రవరి14న ప్రారంభం కాగా.. నెలన్నర వ్యవధిలోనే ఆకతాయిలు పలుమార్లు రాళ్ల దాడులు చేశారు. 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ట్రైన్ పై తరుచూ దాడులు జరుగుతుండటంతో కిటికీ అద్దాలు పగిలిపోవడంతో పాటు ట్రైన్ బాడీ కూడా డ్యామేజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రక్షణ కోసం రైల్వే శాఖ పక్కా ప్లాన్ రెడీ చేసింది. ఆకతాయిల భరతం పట్టేందుకు సిద్ధమైంది.
కర్ణాటకలో "ఓలా" కు బ్రేక్.. 6 నెలలు నిషేధం..!
ప్రాక్టీస్ కోసం కొందరు, పందెం వేసుకుని మరికొందరు
వందే భారత్ ఎక్స్ప్రెస్ పై ముఖ్యంగా కాన్పూర్ నుంచి వారణాసి మధ్య తరుచూ రాళ్ల దాడులు జరుగుతున్నాయి. తాజాగా మార్చి 12న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రాళ్ల దాడి చేసిన ఉత్తర్ ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలోని చిమికీ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువకుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఎందుకు చేశావని పోలీసులు నిందితున్ని ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానం విని అవాక్కయ్యారు. టార్గెట్ మిస్ అవ్వకుండా రాయి విసురుతానని స్నేహితులతో పందెం కట్టానని అందుకు వందేభారత్ ఎక్స్ప్రెస్ ను లక్ష్యంగా ఎంచుకున్నాయని అతడు చెప్పాడు. ఇలా తరచూ ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో రైల్వే శాఖ వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించింది.
ఆకతాయిల ఆటకట్టించేందుకు స్పెషల్ టీమ్స్
వందే భారత్ ఎక్స్ప్రెస్పై తరుచూ రాళ్ల దాడులకు పాల్పడుతున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు రైల్వే శాఖ స్పెషల్ టీమ్స్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గవర్నమెంట్ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా స్పెషల్ టీమ్స్ తయారుచేశారు. మఫ్టీలో ఉండే ఈ టీం సిబ్బంది ట్రైన్ పై తరుచూ దాడులు జరుగుతున్న గ్రామాల్లో తిరుగుతూ అల్లరి మూకలతో కలిసిపోతారు. వారితో పాటు రైలుపై రాళ్ల దాడులకు పాల్పడుతున్నట్లు నటిస్తూ నిందితులను పట్టుకుంటారు.
నిందితులపై కఠిన చర్యలు
ట్రైన్ 18 రక్షణ కోసం స్టేషన్, పోలీస్ ఔట్ పోస్ట్ స్థాయిలో టీమ్స్ను ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్ లెవల్ టీంలో ఒక సబ్ ఇన్స్ పెక్టర్ తో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. ఇక పోలీస్ ఔట్ పోస్ట్ లెవెల్ టీమ్ లో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. రాళ్ల దాడి చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్న నిందితులపై సీఆర్పీసీలోని సెక్షన్ 107, 116 కింద కేసులు నమోదుచేసి విచారణ జరపనున్నారు. ఒకసారి పట్టుబడ్డ యువకులు మళ్లీ రాళ్ల దాడికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.