వరద బాధితుల సహాయ నిధి, బలవంతపు వసూళ్లు, యువకుల దందా, అరెస్టు !
బెంగళూరు: కేరళ, కర్ణాటకలోని కొడుగు ప్రాంతాల్లోని వరద బాధితులను ఆదుకోవడానికి అనేక మంది ముందుకు వచ్చి స్వచ్చందంగా దుస్తులు, నగదు సహాయం చేస్తున్నారు. కేరళ, కొడుగు ప్రాంతాల్లోని వరద బాధితులను ఆదుకుంటున్నామని నమ్మించి కొందరు మోసం చేస్తున్న విషయం వెలుగు చూసింది.
బలవంతంగా నగదు వసూలు చేస్తున్న కొందరు యువకులను దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిలో వాహనాలు నిలిపి బలవంతంగా నగదు వసూలు చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ సమీపంలోని కల్లడ్కె జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం నుంచి కొందరు యువకులు అటు వైపు సంచరిస్తున్న వాహనాలు నిలుపుతున్నారు. మారుతి వ్యాన్ లకు కొడుగు సహాయనిధి అనే బ్యానర్లు కట్టి వరద బాధితులకు సహాయం చెయ్యాలని అంటున్నారు.
కొందరు వారికి తోచినంత నగదు ఇచ్చి వెళ్లిపోతున్నారు. నగదు ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికులను యువకులు బెదిరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వరద బాధితులను ఆదుకోవడానికి సహాయం చెయ్యమంటే ఎందుకు నగదు ఇవ్వరు అంటూ ఆ యువకులు పలువురు ప్రయాణికులను బెదిరించారు.
మా జల్సాల కోసం మిమ్మల్ని నగదు ఇవ్వాలని డిమాండ్ చెయ్యడం లేదని, వరద బాధితుల కోసం అంటూ వారి దగ్గర బలవంతంగా నగదు లాక్కొంటున్నారు. కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
అరెస్టు చేసిన యువకులు ఎలాంటి స్వచ్చంద సంస్థలో పని చెయ్యడం లేదని, మారుతి వ్యాన్లకు బ్యానర్లు కట్టుకుని బలవంతంగా నగదు వసూలు చేస్తున్నారని పోలీసులు అన్నారు. ఇప్పటి వరకు వీరెంత నగదు వసూలు చేశారు ? ఆ నగదు ఏం చేశారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.