ముస్లీంలంతా ఏకం కావాలి: నక్వీ, హిందువులు శాంతి కోరుకుంటారు: దలైలామా
ఢిల్లీ: తీవ్రవాదుల చేష్టలు ఇస్లాం సందేశానికి హాని కలిగిస్తున్నాయని బిజెపి నేత, కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ ప్రపంచానికి ఉగ్రవాదమే పెను సవాలుగా మారిందని ఆయన మండిపడ్డారు.
తప్పుదారి పట్టిన కొంతమంది చర్యలు కరుణ, శాంతి, ఐక్యత, సహోదరభావం వంటి ఇస్లాం నిజమైన సందేశానికి హాని కలిగిస్తున్నాయన్నారు. ఈజిప్టు లక్సర్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.
మానవత్వానికీ, ఇస్లాంకూ అతిపెద్ద శత్రువులుగా మారిన ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా ఇస్లామిక్ ప్రపంచం ఏకం కావాలని పిలుపునిచ్చారు. మత చర్చలో సంస్కరణలు అవసరమన్నారు. ముస్లింలకు కొత్త దార్శనికత, ఇస్లాంపై సమగ్ర అవగాహన కల్పించాలన్నారు.
ఆత్మపరిశీలన, స్వీయదిద్దుబాటుకు ఇదే సమయమన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో యువత సామాజిక సమగ్రత ముఖ్యమైనదనీ, వారికి ఉద్యోగాలు, మెరుగైన ఆర్థిక అవకాశాలు కల్పించాలన్నారు. ఇలాంటి విధానం భారత్లో విజయవంతమైందన్నారు.
మెజార్టీ హిందువులు శాంతినే నమ్ముతారు: దలైలామా
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా శనివారం నాడు మాట్లాడుతూ... శాంతి, స్నేహానికి భారత్ ఎంతోకాలంగా పేరుగాంచిందని చెప్పారు. హిందువుల్లో మెజార్టీ శాంతిని, స్నేహాన్నే కోరుకుంటారని చెప్పారు. భారత్లో అన్ని మతాల వారికి సమాన గౌరవం ఉంటుందని చెప్పారు.