కేంద్రం కరోనా వ్యాక్సిన్ ధరను ఫిక్స్ చేసిందా... ఆ ప్రచారంలో నిజమెంత...?
దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఈసారి టీకాను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికైతే టీకా ధరను ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించలేదు,ఎటువంటి ప్రకటనా చేయలేదు. కానీ దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని తప్పుడు కథనాలు ప్రచారమవుతున్నాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
వ్యాక్సిన్ ధర దాదాపు రూ.500గా ఉండనున్నట్లు వాట్సాప్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్దన్ ట్విట్టర్లో స్పందిస్తూ... ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ పూర్తిగా ఉచితం అని చెప్పారు. ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్స్లో మాత్రం ముందుగా నిర్ణయించిన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ఆ ఛార్జీలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి క్యూఆర్ కోడ్తో ఉన్న సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
Several claims are being made in a forwarded #WhatsApp message regarding the next phase of the #COVID19 vaccination drive. #PIBFactCheck: These claims are #Misleading. For more information related to the vaccination drive, read here: https://t.co/7XBo6zJ3Pj pic.twitter.com/6rbr6Z7tTb
— PIB Fact Check (@PIBFactCheck) February 27, 2021
మరోవైపు గుజరాత్ డిప్యూటీ ముఖ్యమంత్రి నితిన్ పటేల్ వ్యాక్సినేషన్పై మాట్లాడుతూ... ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకాకు రూ.250 ఛార్జి చేయనున్నట్లు తెలిపారు. అయితే టీకా రెండు డోసుల్లో ఇస్తున్నారు కాబట్టి... ఇదే ఛార్జి రెండు డోసులకు వర్తిస్తుందా లేక ఒకే డోసుకా అన్నది ఆయన స్పష్టతనివ్వలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రైవేట్లో టీకా ఛార్జీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా, ఈ ఏడాది జనవరి 16న దేశంలో తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్య కార్యకర్తలకు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
తొలివిడతలో మొత్తం మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. మార్చి 1 నుంచి చేపట్టే రెండో విడత వ్యాక్సినేషన్లో వృద్దులకు వ్యాక్సిన్ అందించనున్నారు. అలాగే 45 ఏళ్లు పైబడి, ఇతర ఆరోగ్యసమస్యలు ఉన్న వ్యక్తులకు కూడా వ్యాక్సిన్ అందించబోతున్నారు. మొత్తం 27 కోట్ల మంది వృద్దులకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.