కేరళ వరదలు, ఆ యువతి బాధ వర్ణనాతీతం: తల్లి, సోదరుడి కోసం వేచి చూస్తే...
తిరువనంతపురం: కేరళలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా వందలాది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. క్రమంగా కేరళ కోలుకుంటోంది. వరదల కారణంగా కనిపించకుండా పోయిన తమవారి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పలువురి మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి.
ఓ యువతి తన తల్లి, సోదరుడు ఎక్కడో ఓ చోట బతికి ఉంటారని ఆశలు పెట్టుకుంది. వర్షాలు, వరదలు తగ్గాక తన వారిని కలుస్తానని ఆమె భావించింది. కానీ కొండచరియలు విరిగి పడటంతో వారు మృతి చెందారు. వారి అవయవాలు కనిపించాయి. ఈ హృదయ విధారక సంఘటన ఇడుక్కి జిల్లాలో జరిగింది.
కుకు అనే యువతి కోల్కతాలో నర్సింగ్ హోంలో ట్రైనీగా పని చేస్తోంది. ప్రమాదం కేసని, త్వరగా ఆసుపత్రికి రావాలని ఆగస్ట్ 17న అర్ధరాత్రి ఆమెకు ఫోన్ వచ్చింది. దీంతో ఆమె వెంటనే బయలుదేరింది. అప్పుడే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి జిల్లాలో తమ నివాసం, తల్లి, సోదరుడు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు వచ్చింది.
కానీ వచ్చి చూస్తే ఇల్లు లేదు. తల్లి, సోదరుడు కనిపించలేదు. వారు ఎక్కడో తలదాచుకుంటారని ఆమె భావించింది. చాలా రోజులు గడిచినా వారి ఆచూకీ దొరకలేదు. తీరా చూస్తే వారు చనిపోయారని తెలిసి, కన్నీరుమున్నీరు అయింది. వారి మృతదేహాలు దొరకలేదు.
ఆ తర్వాత తల్లి అవయవాలు ఇడుక్కి జిల్లాకు రెండు కిలో మీటర్ల దూరంలో లభ్యమయ్యాయి. కొండచరియలు తొలగించాక మృతదేహాలు దొరికాయని అధికారులు చెప్పారు. కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆమె తనకు నర్స్ ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. మరో సంఘటనలో ఇద్దరు వ్యక్తుల అవయవాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇతరుల సాయంతో రోడ్డు పైనే అంత్యక్రియలు నిర్వహించారు.