12 రోజులుగా హోటల్ లో బస..తెల్లారే సరికి నిర్జీవంగా..సొంత గ్రామానికి సమీపంలో!
బెంగళూరు: అయిదేళ్ల కిందట ఇల్లొదిలి వెళ్లి పోయిన ఓ యువతి మృతదేహమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలి పేరు భవిత. 23 సంవత్సరాలు. హసన్ జిల్లాలోని అరకలగూడు గ్రామం ఆమె స్వస్థలం. 12 రోజులుగా ఆమె హసన్ బీఎం మార్గంలోని సరయూ హోటల్ లో ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఆమె మృతదేహం హోటల్ వెనుక భాగంలో కనిపించింది. ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ కలిపింది.. అదే ప్రాణం తీసింది.. ఆ యువతి ఇక దక్కదని..!
సీసీటీవీ ఫుటేజీల పరిశీలన
శనివారం రాత్రి కూడా భవిత చలాకీగా కనిపించారని హోటల్ సిబ్బంది వెల్లడించారు. తెల్లవారే సరికి మృతదేహమయ్యారని, మృతదేహం హోటల్ వెనుక భాగానికి ఎలా వెళ్లిందనేది అర్థం కావట్లేదని వారు పోలీసుల దర్యాప్తులో పేర్కొన్నారు. 12 రోజులుగా ఆమె తమ హోటల్ లోనే నివసిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు అందజేశారు. ఆధార్ కార్డులో పొందుపరిచిన వివరాల ప్రకారం.. భవిత స్వగ్రామం అరకల గూడు అని తేలింది. ఆధార్ కార్డులో ఉన్న చిరునామా ఆధారంగా ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
అయిదేళ్ల కిందటే ఇల్లొదిలి..
తన స్నేహితుడిని ప్రేమించిన భవిత అయిదేళ్ల కిందటే ఇల్లొదిలి వెళ్లిపోయారని తల్లిదండ్రులు వెల్లడించారు. తమ నిర్ణయాన్ని వ్యతిరేకించి వెళ్లినందున ఆమె గురించి తాము పెద్దగా పట్టించుకోలేదని, బంధువుల ఒత్తిడి మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని వారు చెబుతున్నారు. భవిత ఎవరిని ప్రేమిస్తోందనే విషయం తమకు తెలియదని చెప్పారు. భవిత బెంగళూరులో నివసిస్తోందనే విషయం తమ బంధువుల ద్వారా తెలిసిందని, తరచూ ఫోన్ లో మాట్లాడేదని అన్నారు. స్వగ్రామానికి, ఇంటికి రావడానికి ఇష్టం లేదని, అందువల్లే ఎప్పుడూ ఇంటికి రాలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించినట్లు చెబుతున్నారు.
చేతిపై పునీత్ అనే పచ్చబొట్టు..
భవిత మృతదేహంపై ఎలాంటి గాయాలు గానీ, మరొకరితో గొడవ పడినట్లు ఆనవాళ్లు గానీ కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. భవిత చేతి మీద పునీత్ అనే పచ్చబొట్టు ఉందని, అతని గురించి ఆరా తీస్తున్నామని అన్నారు. భవిత ఫేస్ బుక్ ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. శనివారం రాత్రి ఓ యువకుడు హోటల్ ఆవరణలో ఆమెతో మాట్లాడటం సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించిందని, అతనే పునీత్ అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.