దారుణం : చాక్లెట్ ఆశచూపి పసిదానిపై పైశాచికం
కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పశువాంఛ తీర్చుకుంటున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతూ మృగాళ్లలా వ్యవహరిస్తున్నారు. తాజాగా తమిళనాడులో కొన్ని మానవ మృగాళ్లు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు. అనంతరం హత్యచేసి కన్నవారికి కడుపుకోత మిగిల్చారు.
తల్లిదండ్రులు నిద్రపోతుండగా
ఒడిశా రాష్ట్రం కొలడై జిల్లా కలియగుండలం గ్రామానికి చెందిన అమిత్కు భార్య, నాలుగేళ్ల కూతురు ఈశాని ఉంది. దంపతులు జీవనోపాధి కోసం తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడుకు వలస వచ్చి ఇటుకబట్టిలో పనిచేస్తున్నారు. ఆదివారం పనికి వెళ్లిన భార్యాభర్తలు మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయారు. ఆ సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న ఈశాని వారు నిద్ర లేచే సరికి కనిపించలేదు. దీంతో అమిత్ దంపతులు కూతురు కోసం చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటికి సమీపంలో మృతదేహం
సోమవారం ఉదయం ఇంటికి సమీపంలో ఓ చిన్నారి మృతదేహం పడిఉందని తెలుసుకున్న అమిత్ దంపతులు వెళ్లి చూసి షాకయ్యారు. ముఖంపై తీవ్ర గాయాలున్న తమ కూతురు ఈశానీ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ రప్పించి పరిసర ప్రాంతాల్లో నిందితుల కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపారు.
అత్యాచారం చేసి హత్య?
చిన్నారి జననాంగం వద్ద రక్తపు మరకలు ఉండటంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన విక్రమ్, చంద్రవానస్, నిలక్కర్తో పాటు 56ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా చిన్నారిని తరుచూ చాక్లెట్ ఇప్పిస్తామని షాపుకు తీసుకెళ్లేవారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆదివారం సైతం వారు చిన్నారికి చాక్లెట్ ఆశచూపి తీసుకెళ్లారని, వారే అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.