బర్త్ డే రోజు మాయం: డ్యాంలో యువతుల శవాలు
రాయ్ పూర్: గత శనివారం అదృశ్యమైన ఇద్దరు యువతులు అనుమానాస్పద స్థితిలో డ్యాంలో శవమై కనిపించారు. చత్తిస్ గడ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు శవమై కనిపించడంతో పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం మేరకు కోర్బా జిల్లాలోని బాంగో పట్టణంలో ఎరినా (23) అనే యువతి నివాసం ఉంటున్నది. ఈమె స్నేహితురాలు నీలు యాదవ్ (22) అనే యువతి అదే పట్టణంలోని పాలీ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నది.
ఈ నెల 5వ తేదిన ఎరినా పుట్టిన రోజు. బర్త్ డే పార్టీ స్నేహితులతో కలిసి జరుపుకుంటానని ఎరినా కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. తరువాత నీలు యాదవ్ ఇంటికి వెళ్లి ఆమెను పిలుచుకుని వెళ్లింది.
తరువాత వీరి ఆచూకి లేదు. తన కుమార్తె ఎరినా కనపడటంలేదని ఆమె తండ్రి పాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. అయితే బుధవారం సాయంత్రం కోర్బాలోని బాంగో డ్యాంలో ఇద్దరు యువతుల మృతదేహాలు ఉన్నాయని స్థానికులు పోలీసులకు చెప్పారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి. ఇద్దరి మృతదేహాలు ఎరినా, నీలు యాదవ్ వి అని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇద్దరూ హత్యకు గురైనారా, ఆత్మహత్య చేసుకున్నారా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారి శర్మ తెలిపారు.