మిస్సింగ్ ఇన్ఫోసిస్ ఉద్యోగి బ్రసెల్స్ దాడిలో మృతి
న్యూఢిల్లీ: బెల్జియంలోని బ్రసెల్స్ ఉగ్రవాద దాడి సందర్భంగా అదృశ్యమైన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్ర గణేష్ మరణించాడు. అతను మరణించినట్లు నిర్ధారణ అయింది. ఉగ్రవాద దాడి జరిగిన సందర్భంగా అతను బ్రసెల్స్ మెట్రో స్టేషన్లో ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం భారత విదేశాంగ శాఖ తెలిపిన విషయం తెలిసిందే.
అతను బ్రసెల్ మెట్రో స్టేషన్ నుంచి చివరగా తల్లికి ఫోన్ చేశాడు. తన కుమారుడు బతికే ఉన్నాడనే ఆశతో ఆయన కుటుంబ సభ్యులున్నారు. మిత్రుల ఫేస్బుక్ పోస్టింగ్ ఆ ఆశను కల్పించాయి. అతని గురించి విదేశాంగ శాఖకు ఏ విధమైన సమాచారం లేదు. అతను జీవించే ఉంటాడని భావిస్తూ వచ్చింది.
మంగళవారంనాడు ఉగ్రవాదులు బ్రసెల్స్ విమానాశ్రయంపై, మెట్రో స్టేషన్పై దాడి చేసిప్పటి నుంచి అతని జాడ కనిపించలేదు. దీంతో విదేశాంగ శాఖ ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టింది. గాలింపు కోసం రాఘవేంద్ర సోదరుడు బ్రసెల్స్ వెళ్లాడు. పలువురు ఇన్ఫోసిస్ ఉద్యోగులు కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.
తల్లికి చేసిన చివరి కాల్ ఆధారంగా రాఘవేంద్ర ఆచూకీ కనిపెట్టగలమని విదేశాంగ శాఖ భావిస్తూ వచ్చింది. అయితే, గత రెండు రోజుల నుంచి జరిపిన గాలింపు చర్యలు తీవ్రమైన నిరాశను మిగిల్చాయి. ఉగ్రవాద దాడుల్లో 30 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.