ఒడిశాలో కలకలం: మావోయిస్టు నేతను విడుదల చేయకుంటే ఆ వైద్య విద్యార్థిని చంపేస్తాం..
భువనేశ్వర్: ఒడిశాలోని ఎయిమ్స్ విద్యార్థి సొహైల్ అజీజ్ అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. అతడ్ని తామే కిడ్నాప్ చేశామంటూ మావోయిస్టుల పేరిట వెలిసిన ఓ పోస్టర్ సోమవారం రాష్ట్రంలో కలకలం రేపింది.
అంతేకాదు, పోలీసులకు పట్టుబడి ప్రస్తుతం జైల్లో ఉన్న మావోయిస్టు నేత సవ్యసాచి పండాను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే తాము కిడ్నాప్ చేసిన వైద్య విద్యార్థిని హతమారుస్తామని ఆ పోస్టర్లో మావోయిస్టులు పేర్కొన్నారు.
భువనేశ్వర్ లోని బర్ముండా బస్టాండులో ఈ పోస్టర్ కనిపించింది. మరోవైపు ఏడు రోజుల్లో సవ్యసాచిని విడుదల చేయాలని, లేకుంటే విద్యార్థిని చంపేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు.
ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాకు చెందిన సోహైల్ అజీజ్ రెండు వారాల క్రితం అదృశ్యం కాగా, రాష్ట్ర పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారిస్తున్నారు.
ఈ నెల 11న బాంబులేసి.. భువనేశ్వర్ రైల్వేస్టేషన్ను, బస్టాండును నేలమట్టం చేస్తామని కూడా మావోయిస్టులు అందులో పేర్కొన్నారు. ఈ పోస్టర్ ను మావోలే రాశారా? లేక ఇది ఎవరైనా ఆకతాయిల పనా? అన్న విషయాన్ని ఇప్పటికిప్పుడు స్పష్టం చేయలేమని భువనేశ్వర్ నగర కమిషనర్ వైబీ ఖురానియా పేర్కొన్నారు.
ఈ ఘటనపై సవ్యసాచి పండా భార్య శుభశ్రీ పండా అకామిలి కూడా స్పందించారు. అసలు తన భర్తకు సీపీఐ(మావోయిస్టు) పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఇదెవరో కావాలని చేసిన పనిగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది తన భర్త సవ్యసాచి పండాకు సదరు తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నమని ఆరోపించారు.
వైద్య విద్యార్థి సోహైల్ అజీజ్కి సంబంధం ఉన్న సంస్థకు సంబంధించిన వారెవరైనా ఇలా పోస్టర్ వేసి ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో ఇటు ఒడిశా పోలీసులతోపాటు అటు జమ్మూ కశ్మీర్, పశ్చిమబెంగాల్ పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు.