హైదరాబాద్ టెక్కీ క్లూ: ఎంహెచ్ 370 సెటిలైట్ చిత్రం
హైదరాబాద్: గత 11 రోజుల క్రితం అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం కోసం ప్రపంచంలోని 26 దేశాల బృందాలు గాలిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అందుకు సంబంధించిన క్లూను సంపాందించారు. అనూప్ మాధవ్ యెగ్గిన నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
మార్చి 8న అనూప్ మాధవ్ డిజిటల్ గ్లోబ్ సెటిలైట్ క్యూబి02కు సంబంధించిన ఫొటోలను వెతికాడు. అయితే అతనికి ఆరోజున అండమాన్ ఐస్లాండ్ మీదుగా భూమికి దగ్గరగా వెళుతున్న ఓ భారీ విమాన చిత్రాన్ని కనుగొన్నాడు. అయితే దాన్ని మలేషియాకు చెందిన అదృశ్యమైన విమానంగానే అతడు భావించాడు. మార్చి 14న సిఎన్ఎన్ సైట్లో ఆ చిత్రాన్ని అప్లోడ్ చేశాడు.
ఆ చిత్రానికి మాధవ్ ఈ విధంగా రైటప్ రాశాడు..‘నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది మలేషియాకు చెందిన అదృశ్యమైన విమానమే. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. సెటిలైట్ చిత్రంలోని విమానం అటవీ ప్రాంతానికి తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తోంది. అంతేగాక అండమాన్ ఐస్లాండ్కు చెందిన షిబ్పూర్ ఎయిర్ స్ట్రిప్కు దగ్గరగా ఉంది.'
‘ఈ చిత్రాన్ని దగ్గరగా గమనించినట్లయితే మేఘాల కింది నుంచే ఆ విమానం ప్రయాణిస్తోంది. కాబట్టి రాడార్లకు సంకేతాలు అందకుండా పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మలేషియాకు చెందిన అదృశ్యమైన విమానానికి ఉన్న రంగు, పరిమాణం కూడా ఈ చిత్రంలోని విమానానికి ఉన్నాయి. కాబట్టి ఇది అదృశ్యమైన విమానమే'నని మాధవ్ పేర్కొన్నారు. కాగా, 239 మంది ప్రయాణికులున్న ఈ విమానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విమానం హైజాక్ గురై ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.