రోడ్డనుకొని రైల్వేఫ్లాట్ పాంపై కారు నడిపాడు, పోలీసులు ఏం చేశారంటే
రోడ్డుగా భావించి రైల్వే ఫ్లాట్ పాంపై కారును నడిపిన రాజీవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబాయిలోని అంథేరీలో శుక్రవారం నాడు జరిగింది.
ముంబాయి: రోడ్డుగా భ్రమపడి రైల్వే ఫ్లాట్ పాంపై కారును డ్రైవ్ చేసిన వ్యక్తి పోలీసులు అదుపులోకితీసుకొన్నారు. బాగా అలసిపోయినందు వల్లే ఆ వ్యక్తి భ్రమపడి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. రైల్వే అధికారులు అప్రమత్తం కాకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని ప్రయాణీకులు చెబుతున్నారు.
ముంబాయిలోని అంథేరీ ప్రాంతానికి చెందిన రాజీవ్ యాదవ్ శుక్రవారం నాడు తన కారును రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం వరకు తీసుకువచ్చాడు. ఫ్లాట్ ఫాం ను రోడ్డుగా భావించి ఆయన కారును నడిపాడు. ప్రమాదాన్ని గ్రహించిన రైల్వే అధికారి కారును ఆపి వెనక్కి పంపాడు.
రైల్వే ఫ్లాట్ ఫాం పై ఎందుకు కారు తీసుకువచ్చావని రైల్వే అధికారులు రాజీవ్ ను ప్రశ్నించారు. అయితే రోడ్డుగా భావించి తాను రైల్వేఫ్లాట్ ఫాం పైకి కారును తీసుకుని వచ్చానని ఆయన చెప్పారు. ఈ సమాధానంతో ప్రయాణీకులు, పోలీసులు ఆశ్చర్యపోయారు.
వెంటనే రైల్వే పోలీసులు రాజీవ్ ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. రాజీవ్ బాగా అలసిపోయి ఉన్నాడని, ఎలాంటి మత్తుపదార్థాలు తీసుకోలేదని వైద్యులు ధృవీకరించారు. రాజీవ్ అలసిపోయి, నిద్రమత్తులో ఉన్నందున పొరపాటు పడి ఉండవచ్చని వైద్యులు చెప్పారు. అయితే రాజీవ్ చేసింది పొరపాటేనని భావించి ఆయనను అరెస్టు చేశారు పోలీసులు.