చెప్తే విన్లేదు: సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు మరో కారణం
ముంబై: టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడం వెనుక మరో కారణం వెలుగు చూసింది! మిస్త్రీని బయటకు పంపించడం వెనుక రోజుకో కారణం బయటకు వస్తోంది. తాజాగా టీసీఎస్ అంశం తెరపైకి వచ్చింది.
టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) విలువ అత్యున్నతంగా ఉన్నప్పుడు అయిదు శాతం వాటా విక్రయించాలని ట్రస్ట్ సభ్యులు సూచించగా మిస్త్రీ పెడచెవిన పెట్టారని సంస్థలోని అంతర్గత వర్గాలు చర్చించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
గ్రూప్లో ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు తిరిగి మూలధనం అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని సభ్యులు పేర్కొన్నారని తెలుస్తోంది. దీంతో పాటు పలు సూచనలను మిస్త్రీ బేఖాతరు చేశారని, అందుకే ఆయనను అక్టోబర్ 24వ తేదీన పక్కన పెట్టారని అంటున్నారు.
టీసీఎస్లో టాటా సన్స్కు 74% వాటా ఉంది. అత్యున్నత విలువ సమయంలో 5 శాతం వాటా అంటే ప్రస్తుత మారకంలో రూ.20,000 కోట్లు. గ్రూపుకు భారంగా మారిన డివిడెండ్ల చెల్లింపులకు ఈ నగదు పనికొస్తుందని సభ్యులు భావించారు. అయితే మిస్త్రీ దీనిని నిర్లక్ష్యం చేయడం వారికి ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. రతన్ టాటా చైర్మన్గా ఉన్నప్పుడూ ఈ మాట వినలేదని మిస్త్రీ వాదించారట.