మిస్త్రీకి మరో షాక్: టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవి నుంచి ఔట్
ముంబై: టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా.. సైరస్ మిస్త్రీకి మరో షాక్ ఇచ్చారు. టాటా ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికారు. సోమవారం ఉదయం జరిగిన టాటా ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్స్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సభ్యులు ప్రకటించారు.
డైరెక్టర్ పదవి నుంచి మిస్త్రీని తొలగించాలంటూ సమావేశంలో పలువురు షేర్ హోల్డర్స్ సూచించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టాటా ఇండస్ట్రీస్ తెలిపింది. టాటా గ్రూపులోని ఆరు కంపెనీలు మిస్త్రీ తొలగింపునకై ఈజీఎంలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
చైర్మన్గా ఎన్నికయ్యేందుకు తప్పుదోవ పట్టించారని, చేసిన వాగ్దానాలు అమలు చేయలేదని, అధికారాలన్నీ తన ఆధీనంలో ఉంచుకుని, సంస్థ యాజమాన్య వ్యవస్థలను బలహీన పరచేందుకు మిస్త్రీ కుట్ర చేశారని టాటా సన్స్ ఆరోపించింది.
2011లో టాటా సన్స్ చైర్మన్ పదవికి అర్హుడిని ఎంపిక చేసేందుకు నియమించిన కమిటీని మిస్త్రీ తన ప్రకటనలతో తప్పుదోవ పట్టించారని టాటా సన్స్ పేర్కొంది. అలాగే 2015లో మిస్త్రీ ప్రవేశపెట్టిన నిబంధనావళి ప్రకారం చూసినా... టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగింపునకు గురైన ఆయన గ్రూప్ సంస్థల బోర్డుల నుంచి స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సి ఉండగా వాటిని ఉల్లంఘించారని ఆరోపించింది.