నేనో కోరలు లేని చైర్మన్ను, టాటాకు నష్టమే: మిస్త్రీ తీవ్ర వ్యాఖ్యలు
ముంబై: టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను అర్ధాంతరంగా తొలగించడంపై సైరస్ మిస్త్రీ తీవ్రంగా స్పందించారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నానో కారు నుంచి టాటా గ్రూప్ వాటా పెరుగుదల వరకు, కంపెనీలు మూత వేయడటం నుంచి ఎయిర్ లైన్స్ వరకు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నానో కారు మొదటి నుంచి నష్టాలు తెస్తోందని చెప్పారు. ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్ లైన్స్తో బలవంతంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, తాను చైర్మన్ అయ్యాక టాటా గ్రూప్ వాటా 14.9 శాతం పెరిగిందన్నారు.
టాటా సన్స్ కంపెనీ బోర్డు సమావేశం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తనకు తన వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. తనను హఠాత్తుగా తొలగించడం తనకు, టాటా గ్రూప్ ప్రతిష్టకు కూడా నష్టమే అన్నారు. 2011లో అనూహ్య పరిస్థితుల్లో తాను టాటా చైర్మన్ అయ్యానని చెప్పారు.
లాభాలు తెచ్చే అవకాశం లేకుంటే అలాంటి వాటిని మూసేయాల్సిందే అన్నారు. వీటన్నింటి దృష్ట్యా కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. తనను కోరలు లేని చైర్మన్ను చేశారన్నారు. నేను చైర్మన్ను కాగానే నా చేతులు కట్టేసి సంస్థ నియమావళిని మార్చారన్నారు.
బోర్డు సభ్యులు ప్రతిష్టను కాపాడుకోలేకపోయారన్నారు. టాటా కుటుంబ ట్రస్టులకు చెందిన ప్రతినిధులు పోస్టుమాన్లుగా వ్యవహరించారని, బోర్డు సమావేశాలు జరుగుతున్న సమయంలో మధ్యలోనే వెళ్లిపోయి.. రతన్ సూచనలను తీసుకుని వచ్చేవారన్నారు. తనను తొలగించమని ఓటేసిన ఇద్దరు గతంలో తన పనిని మెచ్చుకున్నారని చెప్పారు.
డొకొమో డీల్ అత్యంత ఘోరమైనదన్నారు. తనను పనితీరు కారణంగా తొలగించారనుకోవడం లేదన్నారు. టాటా గ్రూప్ విలువను తాను భారీగా పెంచానని చెప్పారు. కాగా, సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ చైర్మన్ నుంచి హఠాత్తుగా తొలగించిన విషయం తెలిసిందే.