టాటాలకు వ్యతిరేకంగా పోరు కొనసాగిస్తా: సైరస్ మిస్త్రీ
సైరస్ మిస్త్రీకి టీసీఎస్ బోర్డు నుంచి ఉద్వాసన పలికారు. ఈ నేపథ్యంలో మిస్త్రీ తాజాగా, బుధవారం స్పందించారు. తాను టాటాల పైన పోరును కొనసాగిస్తానని చెప్పారు.
ముంబై: సైరస్ మిస్త్రీకి టీసీఎస్ బోర్డు నుంచి ఉద్వాసన పలికారు. ఈ నేపథ్యంలో మిస్త్రీ తాజాగా, బుధవారం స్పందించారు. తాను టాటాల పైన పోరును కొనసాగిస్తానని చెప్పారు. టీసీఎస్ అసాధారణ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ వల్ల టాటా గ్రూప్ వారసత్వ సంపదను రక్షించాలనే తన సంకల్పానికి మరింత బలం చేకూర్చిందన్నారు.
ఈ మేరకు పరిపాలనలో సంస్కరణల కోసం తాను పాటుపడతానన్నారు. మంగళవారం నాడు టీసీఎస్ అసాధారణ సర్వ సభ్య ఓటింగ్ జరిగింది. మిస్త్రీ తొలగింపుకు 93 శాతానికి పైగా అనుకూలంగా, 6 శాతానికి పైగా వ్యతిరేకంగా ఓటు వేశారు. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆయనకు మద్దతు లభించింది.
రిటైల్ ఇన్వెస్టర్లు మిస్త్రీకి మద్దతిస్తూ ఆయన తొలగింపుకు వ్యతిరేకంగా 78 శాతం మంది ఓటు వేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఓటింగ్ ప్రక్రియ ద్వారా మైనార్టీ వాటాదారులు టాటా గ్రూప్ పాలనలో మార్పు అవసరమని బలమైన సిగ్నల్ పంపించారన్నారు. దానిని అశ్రద్ధ చేయకూడదన్నారు. టాటా గ్రూపులో సంస్కరణల కోసం తాను కూడా పోరాటం కొనసాగిస్తానన్నారు. గ్రూప్ సంస్కరణలతో స్టాక్ హోల్డర్ల హక్కులను, పాలనను రక్షించవచ్చన్నారు.
కాగా, టాటా సన్స్ గ్రూపు కంపెనీల నుంచి మిస్త్రీని పూర్తిగా పంపించేసేందుకు మంగళవారం నాడు తొలి ఘట్టం ముగిసింది. ఇప్పటికే టీసీఎస్ ఛైర్మన్ పదవిని కోల్పోయిన ఆయన, మంగళవారం ఆ కంపెనీ డైరెక్టరు బాధ్యతలకు కూడా దూరమయ్యారు. టీసీఎస్ సహా ఏడు కంపెనీల బోర్డు డైరెక్టరు పదవుల నుంచి మిస్త్రీని తొలగించేందుకు ఈ నెలలో వరుస అసాధారణ సర్వసభ్య సమావేశాలను (ఈజీఎం) టాటా సన్స్ నిర్వహిస్తోంది. ఇందులో మొదటి ఈజీఎం మంగళవారం జరిగింది.
అందుకే మిస్త్రీ తొలగింపు
మిస్త్రీని నియమించిన ప్రమోటరు గ్రూపు (టాటా సన్స్, టాటా ట్రస్ట్స్) నమ్మకాన్ని ఆయన కోల్పోయారని, టీసీఎస్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీని ఆయన విడిచిపెట్టాలని సమావేశంలో స్వతంత్ర డైరెక్టర్ అమన్ మెహతా అన్నారు. పనితీరు కంటే విశ్వసనీయతను కోల్పోవడమే ఇక్కడ కీలక అంశమన్నారు.
టీసీఎస్ వాటాదార్లకు మిస్త్రీ లేఖ
టాటా సన్స్ గ్రూపు మూలాలను కాపాడేందుకే తన పోరాటమని సైరస్ మిస్త్రీ మంగళవారం నాడే స్పష్టం చేశారు. అంతేకాని పదవిలో నుంచి తీసేశాక కూడా ఇంకా ఆఫీసును పట్టుకొని వేలాడాలని అనుకోవడం లేదన్నారు. టీసీఎస్ అసాధారణ సర్వసభ్య సమావేశానికి (ఈజీఎం) ముందు వాటాదార్లకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.