భారత్లో భీకరంగా కరోనా విస్తరణ: సరిగ్గా 7 నెలల్లో: రోజూ 2.87 లక్షల పాజిటివ్ కేసులు నమోదు
వాషింగ్టన్: ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించేసుకున్న కరోనా వైరస్..భారత్లో మరింత భయానకంగా విస్తరించడానికి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా రోజూ 20 వేలకు కాస్త అటూ, ఇటుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతుంటే ఆశ్చర్యపడాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోందని అమెరికాలోని మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వెల్లడించింది. భవిష్యత్తులో ఈ వైరస్ భారత్లో కట్టలు తెంచుకుంటుందని జోస్యం చెప్పింది. ఎన్నో రెట్లు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
చైనా రణతంత్రం: 1962 నాటి యుద్ధానికి సీక్వెల్?: నాడూ గాల్వన్ నుంచి వెనక్కి: విరుచుకుపడటానికా?
2021 ఫిబ్రవరి నాటికి..
ఏడు నెలల కాలం ముగిసే సరికి భారత్లో రోజూ గరిష్ఠంగా 2.87 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావడానికి అవకాశం ఉందని అంచనా వేసింది. దీనికి సంబంధించిన ఓ నివేదికను ఎంఐటీ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారత్లో రోజూ లక్షల్లోనే పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని వారు తమ నివేదికలో అంచనా వేశారు. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చని అభిప్రాయపడ్డారు.
భారత్ సహా 84 దేశాల్లోని స్థితిగతులపై స్టడీ..
కరోనా వైరస్ మహమ్మారి విస్తరణపై ఎంఐటీ పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. భారత్, అమెరికా, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్, మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ఇరాన్, జర్మనీ వంటి దేశాల్లోని స్థితిగతులపై ఆరా తీశారు. ఆయా దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతోన్న వైరస్ వ్యాప్తి, దాన్ని నియంత్రించడానికి తీసుకుంటోన్న చర్యలు, జనాభా, కరోనా వ్యాపిస్తోన్న వేగం, కోలుకుంటోన్న వారి సంఖ్య, టెస్టింగ్ రేటు, ఈ ఏడాది జులై 1వ తేదీ నాటి నుంచి రోజూ నమోదవుతోన్న టెస్టింగ్ రేటులో పాయింట్ వన్ పర్సెంట్ పెరుగుదల చోటు చేసుకోవడం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు.
ఒక పేషెంట్ వల్ల ఎనిమిదిమందికి
ఎంఐటీ పరిశోధకులు హజీర్ రెహ్మన్దాద్, టీవై లిమ్, జాన్ స్టెర్మెన్ దీనిపై రీసెర్చ్ చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్లోనే కరోనా వైరస్ భయానకంగా విస్తరించడానికి అవకాశం ఉన్నట్లు వారు అంచనా వేశారు. 2021 ఫిబ్రవరి నాటికి భారత్లో రోజూ 2.87 లక్షల పాజిటివ్ కేసులు, అమెరికా-95,000, దక్షిణాఫ్రికా-21,000, ఇరాన్-17,000 వరకు నమోదు అవుతాయని తమ నివేదికలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఒక పేషెంట్ వల్ల ఎనిమిది మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని అంచనా వేశారు.
60 కోట్ల మందికి..
వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మందికి జనాభాకు కరోనా వైరస్ సోకుతుందని అంచనా వేశారు. ఇందులోనూ భారత్ అగ్రస్థానంలో ఉండే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికి 20 నుంచి 30 కోట్ల మందికి జనాభా వైరస్ బారిన పడగా.. మార్చి నుంచి మే మధ్యకాలంలో ఈ సంఖ్య 60కు పెరుగుతుందని అంచనా వేశారు. కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయడానికి దానికి వ్యాక్సిన్ కనుగొనడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. అంతకుమించి మరో మార్గం లేదని వారు తమ నివేదికలో అంచనా వేశారు.