నేనూ జాత్యహంకార బాధితుడ్నే: సీఎం సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఈశాన్య భారతదేశ ప్రజలు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో జాత్యహంకారానికి గురవుతున్నారని మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో జాతీయ స్థాయి రాజకీయ నేతలకు కూడా దేశం గురించి వివరంగా తెలియదని దుయ్యబట్టారు. మన దేశంలో జాత్యహంకారం అత్యంత నీచమైనదని, తాను స్వయంగా అనేకసార్లు ఈ దురహంకారానికి గురయ్యానని తెలిపారు.
74 ఏళ్ళ వయసుగల తన్హావ్లా మిజోరాం ముఖ్యమంత్రిగా ఐదోసారి బాధ్యతలు చేపట్టారు. సుమారు 20-25 సంవత్సరాల క్రితం తాను ఓ విందుకు హాజరయ్యానని, అక్కడ ఓ వ్యక్తి తనతో మాట్లాడుతూ.. 'మీరు భారతీయుడిలా లేరు' అన్నాడని చెప్పారు. అందుకు తాను బదులిస్తూ 'భారతీయుడు ఎలా కనిపిస్తాడో ఒక వాక్యంలో చెప్పు' అని తాను అడిగినట్లు తెలిపారు.
సామాన్యులు మాత్రమే కాదని, జాతీయ స్థాయి నాయకులకు కూడా, వారు బీజేపీవారైనా, కాంగ్రెస్వారైనా, దేశం గురించి తెలియదని చెప్పారు. దేశం గురించి తెలియనివాళ్ళు నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. దేశం గురించి జాతీయ నేతలకు తెలియకపోవడాన్నిబట్టి దేశభక్తి, విద్య కొరవడినట్లు చెప్పవచ్చునన్నారు. ఆధిక్యతా భావాన్ని ఇది సూచిస్తుందన్నారు.
ప్రపంచంలోని ప్రధాన జాతులు భారతదేశంలో ఉన్నట్లు జాతీయ నేతలకు తెలియదని తన్హావ్లా అన్నారు. దక్షిణాదిలో ద్రావిడులు, ఉత్తరాదిలో ఆర్యులు, ఈశాన్యంలో మంగోలులు ఉన్నారని, అంతేకాకుండా అనేక ఆదివాసీ జాతులు కూడా మన దేశంలో ఉన్నారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయవాదం అత్యధికంగా ఉండటానికి ఇదే కారణమని చెప్పారు.