పల్లకీలో పెద్ద సారూ.. రోడ్డు పనులు పరిశీలించేందుకు వస్తే.. ఆపూర్వ స్వాగతం ....
ఐజ్వాల్ : పెళ్లి సమయంలో వధువును పల్లకీలో తీసుకొస్తుంటారు. ఇదీ సనాతన సాంప్రదాయం కూడా. కానీ అధికారులను పల్లకీలో తీసుకెళ్లడం మాత్రం అరుదు. అలాంటి ఘటనే మిజోరంలో జరిగింది. ఆ మరుమూల ప్రాంత ప్రజలు తమ ఊరికొచ్చిన కలెక్టర్ను పల్లకీ మోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారి ఆప్యాయతను ఆ కలెక్టర్ కూడా మన్నించి .. సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు.
మిజోరంలోని సియహో జిల్లాలో మారుమూల గ్రామం తిసోపి. ఇక్కడ కేవలం 400 మంది మాత్రమే నివశిస్తారు. అయితే ఈ గ్రామానికి కనీస సౌకర్యాలు లేవు. రహదారి కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటీవల పరిస్థితి మారింది. గ్రామం అభివృద్ధి బాట పడుతుంది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గ్రామంలో రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు సియహో జిల్లా కలెక్టర్ భూపేశ్ చౌదరి ఇటీవల గ్రామానికి వచ్చారు. ఆయన వర్షాన్ని కూడా లెక్క చేయకుండా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ ఊరికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు తమ అభిమానాన్ని చూపించారు.
ఇన్నేళ్లు తమ గ్రామానికి ఏ ఒక్క అధికారి కూడా రాలేదు. ఇప్పుడు ఏకంగా కలెక్టర్ రావడంపై ఆనంద పడ్డారు. పొలిమేరలోనే ఘనస్వాగతం పలికారు. అక్కడే ఉన్న స్థానికులు కొందరు పల్లకిలో ఎక్కించుకున్నారు. గ్రామంలోకి మోసుకెళ్లారు. అయితే వద్దని భూపేశ్ వారించినా వినిపించుకోలేదు. గ్రామంలో ప్రజలు చూపించిన అభిమానంపై కలెక్టర్ స్పందిస్తూ .. వీరి ఆప్యాయత ఆశ్చర్యం కలిగించిందన్నారు. తనను చూడగానే వారు సంతోషపడ్డారని గుర్తుచేశారు. తనపై వారు చూపిన ప్రేమ ఆనందంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల కోసం గ్రామంలో పర్యటించానని కలెక్టర్ భూపేశ్ పేర్కొన్నారు. కానీ అక్కడ స్థానికులు చూపిన అప్యాయత కట్టిపడేసిందన్నారు.