అబ్బే.. మాకు తెలియదు, అసోం సీఎం కేసుపై మిజోరం సీఎస్.. రీ లూక్ అంటూ..
అసోం, మిజోరం ఘర్షణ పీక్కి చేరిన సంగతి తెలిసిందే. సరిహద్దుపై చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. అయితే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు రీ లూక్ చేస్తామని చెప్పింది. దీంతో ఇరు ప్రభుత్వాలు కాస్త మెత్తబడ్డాయని అర్థం చేసుకోవచ్చు. సరిహద్దుల్లో నెలకొన్న హై టెన్షన్ నేపథ్యంలో కూల్ కావడం కాస్త మంచి పరిణామమే అని చెప్పాల్సి ఉంటుంది.
అసోం సీఎం శర్మపై కేసుకు సంబంధించి పున:పరిశీలిస్తామని మిజోరం ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్మావియా చువాంగో తెలిపారు. సరిహద్దు వివాదం నేపథ్యంలో సీఎం శర్మపై ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి తనకు గానీ, సీఎం జోరంతంగాకు కూడా తెలియదని వివరించారు. ఆ అంశాన్ని పరిశీలించామని సీఎం తనకు చెప్పారని.. అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు.
అసోం మిజోరం సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి మిజోరం ప్రభుత్వం అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసింది. గతనెల 26వ తేదీ నుంచి ఘర్షణపూరిత వాతావరణం ఉండగా.. 30వ తేదీన కేసు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి మిజోరం ఐజీ జాన్ వివరాలు కూడా వెల్లదీశారు. కానీ ఇప్పుడు సీఎస్ ఇలా కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసుకు సంబంధించి శర్మ కూడా స్పందించారు. పోలీసులు కాక.. తటస్థ ఏజెన్సీలకు ఎందుకు బాధ్యత ఇవ్వలేదని ప్రశ్నించారు.
అసోం, మిజోరం ఘర్షణలో ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు చనిపోయారు. ఎస్పీ సహా 50 మంది గాయపడ్డారు. ఘర్షణకు అసోం పోలీసులే కారణం అని మిజోరం చెబుతోంది. గతనెల 26వ తేదీన జరిగిన ఘర్షణలో మిజోరంకు చెందిన ఇద్దర కూడా చనిపోయారని ఆ రాష్ట్రం చెబుతోంది.