'మి టూ' షాక్: ఎంజే అక్బర్పై వరుసగా మహిళల ఫిర్యాదు, నైజీరియా పర్యటన మధ్యలోనే రాక!
న్యూఢిల్లీ: 'మి టూ' ఉద్యమం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పని చేసిన ఓ మహిళ అదే విభాగంలోని ఓ కాంగ్రెస్ నేతపై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పైన కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఆయనపై ఇప్పటికే ఆరుగురు మహిళలు ఫిర్యాదు చేయగా, ఏడో మహిళ కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
ముద్దుపెట్టుకున్నంత పని: ఎయిర్హోస్టెస్, అందంగాలేని యువతులే ఇలా: అభిజిత్ తీవ్రవ్యాఖ్య
ఎంజే అక్బర్ పైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు పలువురు డిమాండ్ చేశారు. ఎంజే అక్బర్ పైన ఆరోపణలు మోడీ సర్కారును ఇరకాటంలో పడేసింది. కాంగ్రెస్, బీజేపీలను కూడా 'మి టూ' కుదిపేస్తోంది. తాజాగా ఏడో మహిళ.. ఎంజే అక్బర్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కార్యాలయంలోనే బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని గజాలా వాహబ్ ఆరోపించారు.
ఎంజే అక్బర్ పాత్రికేయ వృత్తిలో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, యుక్త వయస్సులో మహిళలను సమావేశాల కోసం హోటల్ గదులకు రమ్మన్నట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నాయకులు సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరిపై విచారణ జరపాలని కేంద్రమంత్రి మేనకా గాంధీ కోరారు.
ఇదిలా ఉండగా, ఎంజే అక్బర్ నైజీరియా పర్యటనలో ఉన్నారు. పర్యటనను కుదించుకోవాలని ఆదేశాలు వెళ్లాయి. అక్బర్ శుక్రవారం తిరిగి రావాల్సి ఉంది. కానీ గురువారమే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఆయనపై పలువురు మహిళల ఫిర్యాదు నేపథ్యంలో దానిని పరిగణలోకి తీసుకుంటామని, అదే సమయంలో ఆయన ఏం చెబుతారనేది కూడా ముఖ్యమని అంటున్నారు. ఇది మహిళల భద్రతకు సంబంధించిన అంశమని, కాబట్టి ప్రధాని సీరియస్గా తీసుకుంటారని, దీనిని వదిలేయలేమని అధికారులు చెబుతున్నారు.