మి టూ: జర్నలిస్ట్ ప్రియ రమణిపై పరువు నష్టం దావా వేసిన ఎంజే అక్బర్
న్యూఢిల్లీ: తనపై 'మి టు' ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ ప్రియ రమణిపై యూనియన్ మినిస్టర్ ఎంజే అక్బర్ క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ఆమె ఆరోపణలు చేసినందుకు గాను ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో కేసు వేశారు.
అన్యాయంగా తనపై నిందలు మోపుతున్నారని, పలువురు పాత్రికేయులు చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం కాదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. తనను అవమానపరిచేందుకే ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆదివారమే ఆయన తెలిపారు. మి టూ ఉద్యమంలో భాగంగా పలువురు మహిళా పాత్రికేయులు తమను ఎంజే అక్బర్ లైంగికంగా వేధించారని సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేశారు.
తనపై వచ్చినవన్నీ తప్పుడు, కల్పిత ఆరోపణలని, తమ లాయర్లు ఈ నిరాధార ఆరోపణలను పరిశీలించి న్యాయపరమైన చర్యలు తీసుకోవడంపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని ఎంజే అక్బర్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉందనగా ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవాలన్నారు.