నన్ను లాగి పెదాలపై ముద్దు! నోట్లో నాలుక..: ఎంజే అక్బర్పై సీఎన్ఎన్ జర్నలిస్ట్ షాకింగ్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి ఎంజే అక్బర్పై మరో మహిళా జర్నలిస్టు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. ఇప్పటికే దాదాపు 10 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్బర్ను వెంటనే కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అక్బర్ పై త్వరలోనే వేటుపడే అవకాశముందని భావిస్తున్న తరుణంలో తాజాగా సీఎన్ఎన్ జర్నలిస్టు కూడా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
సీఎన్ఎన్ జర్నలిస్టు
ఎంజే అక్బర్ దగ్గర శిక్షణకు వచ్చిన సమయంలో తనను లైంగికంగా వేధించాడని అమెరికా పౌరురాలు, సీఎన్ఎన్ రిపోర్టర్ మజ్లీ డి పుయ్ కంప్ ఆరోపించారు. 2007 సమయంలో తాను ఏషియన్ ఏజ్ పత్రికలో ‘ఇన్ టర్న్'(శిక్షణ కోసం)గా చేరానని బాధితురాలు తెలిపింది.
కృతజ్ఞతలు చెబుతామని వెళితే..
ఆ సమయంలో ఏషియన్ ఏజ్ పత్రిక ఎడిటర్గా అక్బర్ ఉన్నాడనీ, అతనికే తాను రిపోర్ట్ చేసేదానినని వెల్లడించింది. ‘ఇంటర్న్ షిప్లో భాగంగా చివరిరోజు ఆయన(ఎంజే అక్బర్)కు నేను కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లాను. ఈ సందర్భంగా నేను ఆయనతో కరచాలనం చేశాను. అయితే, ఆయన మాత్రం అసభ్యంగా ప్రవర్తించారు' అని వెల్లడించింది.
పెదాలపై ముద్దుపెట్టి..
‘ఎంజే అక్బర్ నన్ను ఒక్కసారిగా దగ్గరకు లాక్కున్నాడు. పెదాలపై బలవంతంగా ముద్దుపెట్టాడు. తన నాలుకను నా నోటిలోకి తోస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. అప్పుడు నా వయసు 18 ఏళ్లే. నేనేం చేయలేక సైలెంట్గా ఉండిపోయా' అంటూ తన భయానక అనుభవాన్ని చెప్పుకొచ్చింది మజ్లీ.
స్నేహితుడి కూతురని చూడకుండా..
ఎంజే అక్బర్ తనకు తల్లిదండ్రుల ద్వారా పరిచయం అయ్యాడని మజ్లీ తెలిపింది. 90వ దశకంలో తన తల్లిదండ్రులు ఢిల్లీలో మీడియా కరస్పాండెంట్స్గా పనిచేసేవారని వెల్లడించింది. తన దేశంలో ఒంటరిగా ఉంటున్న స్నేహితుడి కుమార్తెను కాపాడాల్సిన అక్బర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో ఎంజే అక్బర్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అతడ్ని వెంటనే పదవి నుంచి తప్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.